Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
- నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
- కార్మికులకు డబుల్ బెడ్రూంలో ప్రాధాన్యమివ్వాలని డిమాండ్
- కార్మిక గర్జన పాదయాత్రకు సంఘీభావం
నవతెలంగాణ - పటాన్ చెరు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా యని, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని పారిశ్రామికవాడలో సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్రకు శనివారం రాఘవులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రామిక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడారు. కార్మిక సమస్యలపై సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి రాష్ట్ర నాయకులు వీరయ్య, భూపాల్, జయలక్ష్మీ, భాస్కర్ బృందం చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర కొనసాగుతోందన్నారు. కార్మికులు ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను బూచిగా చూపి పాలకులు, యాజమన్యాలు కార్మికుల హక్కులను కాలరాసేలా లేబర్ కోడ్లను తెచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కనీస వేతనాలు ఆశించిన కార్మికులకు మొండిచేయి చూపారని తెలిపారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, యూనియన్ పెట్టనీయకుండా యాజమాన్యాలకు అనుకూలంగా పాలకులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 27న జరిగే బంద్లో టీఆర్ఎస్ కలిసి రావాలని, లేనిపక్షంలో వీరి అసలు రంగు బయట పడుతుందని అన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు పెంచితే పరిశ్రమలు తరలిపోతాయని, ఖజానాకు భారం పడుతుందనే ప్రభుత్వ అసత్య ప్రచారం సరికాదన్నారు. కార్మిక వర్గం, ప్రజల వద్ద రోజు రోజుకూ కొనుగోలు శక్తి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు వేతనాలు పెంచకుండా.. పరిశ్రమల అధిపతులకు మాత్రం రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబరు కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 8న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెలో అన్ని రాజకీయ పార్టీలు కలసిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న సంగారెడ్డిలో జరిగే కార్మిక గర్జన పాదయాత్ర ముగింపు సభకు సీఐటీయూ జాతీయ నాయకులు కేకే పద్మనాభం హాజరవనున్నట్టు తెలిపారు. ఈ సభలో కార్మికవర్గం పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పాదయాత్రకు కేవీపీఎస్ స్వాగతం
పటాన్చెరులోకి ప్రవేశించిన కార్మిక గర్జన పాదయాత్ర బృందానికి కేవీపీఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్, జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, జిల్లా నాయకులు ప్రభాకర్ తదితరులు పాదయాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షించారు.