Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పుడు బియ్యం కొనబోమని మరోమారు కేంద్రం స్పష్టీకరణ
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 350 బాయిల్డ్ మిల్లులపై తీవ్ర ప్రభావం
- ఈ మూడేండ్లలో రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 70 కొత్త మిల్లుల ఏర్పాటు
- ఒక్కో మిల్లుకు రూ.7కోట్ల చొప్పున రూ.500కోట్ల పెట్టుబడి
- ఎఫ్సీఐ అడ్డం తిరగడంతో ఆందోళనలో రైతులు, కార్మికులు
- యాసంగి వరి వద్దంటే మూతదిశగానే మిల్లులు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
యాసంగి ధాన్యం బాయిల్డ్ చేసి బియ్యంగా మార్చే మిల్లుల కథ కంచికి చేరే ప్రమాదం కనిపిస్తోంది. ఈ యాసంగి నుంచి ఒక్క బాయిల్డ్ బియ్యం గింజా తీసుకోబోమని ఎఫ్సీఐ తేల్చి చెప్పింది. రాష్ట్ర సర్కారు పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి కేంద్రంలోని మంత్రులు ససేమిరా అనే సమాధానమే ఇచ్చారు. ఎండాకాలం ధాన్యాన్ని బాయిల్డ్ చేస్తేగానీ క్వింటా ధాన్యానికి 68 కిలోలు ఇవ్వలేమని చెబుతున్న మిల్లర్లు.. ఇప్పుడు ఆ ఉప్పుడు బియ్యమే తీసుకోమంటే మిల్లులు మూతేసుకోవడమే శరణ్యమని చెబుతున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 350 పారాబాయిల్డ్ రైస్మిల్లులపై పడే ప్రభావంతో పాటు ఆ రంగంపై ఆధారపడ్డ వారిపై కూడా తీవ్రంగా చూపుతుంది. ఇదేగాక రూ.7కోట్ల చొప్పున ఒక్కో మిల్లు ఏర్పాటుకు ఖర్చు చేసి మరీ ఈ మూడేండ్లలోనే సుమారు రూ.500కోట్ల పెట్టుబడితో కొత్తగా 70 బాయిల్డ్ మిల్లులు ఏర్పడ్డాయి. ఇన్నాళ్లూ ఎఫ్సీఐ కొర్రీల నడుమ అడ్డదారుల్లో అయినా నష్టాలపాలవ్వకుండా నడిచిన బాయిల్డ్ మిల్లుల కథ ఇప్పుడు కంచికిచేరే పరిస్థితులే కనిపిస్తున్నాయి. 2.5లక్షల ఎకరాల్లో సాగైన వరి విస్తీర్ణం గడిచిన ఏడేండ్లుగా పెరుగుతూ వానాకాలం, యాసంగి అనే తేడాలేకుండా సుమారు 11లక్షల ఎకరాల్లో సాగవుతోంది. దిగుబడి కూడా ఏమాత్రం తీసిపోకుండా సుమారు 18లక్షల మెట్రిక్టన్నులకుపైగానే వస్తోంది. ప్రతియేడూ ఎఫ్సీఐ షరతుల్లేకుండానే వచ్చిన ప్రతి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇస్తే తీసుకుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నూకశాతం పెరిగే యాసంగి పంటను మిల్లులు బాయిల్డ్ చేసి బియ్యంగా మర ఆడిస్తూ ఇస్తూ వచ్చాయి. ఆ బియ్యాన్ని ఎక్కువగా వినియోగించే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు ఎఫ్సీఐ కేటాయిస్తూ వచ్చింది. అయితే రెండేండ్లుగా అక్కడా వరి సాగు విస్తీర్ణం పెరగడం, సన్నాలవైపు ప్రజలు మళ్లడం వంటి పరిణామాలతో ఎఫ్సీఐ బాయిల్డ్ బియ్యం సేకరణకు సిద్ధంగా లేదు.
ఎఫ్సీఐ కొర్రీలతో అడ్డుదారుల్లో మిల్లులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 670 రైస్మిల్లులు ఉంటే అందులో 330 'రా' రైస్ (ముడిబియ్యం) మిల్లులు, 350 పారాబాయిల్డ్ రైస్మిల్లులు ఉన్నాయి. రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని మిల్లుల ద్వారా కష్టం మిల్లింగ్ పద్ధతిలో ఎఫ్సీఐ బియ్యాన్ని తీసుకుంటుంది. వంద కిలోల ధాన్యానికి ముడిబియ్యం అయితే 67కిలోలు, బాయిల్డ్ అయితే 68కిలోలు తిరిగి ఇవ్వాలని మిల్లులకు షరతు పెట్టింది. తాలు, తర్రలేకుండా సరైన తేమశాతం ఉంటేనే క్వింటా ధాన్యానికి 68కిలోల బియ్యం వచ్చే పరిస్థితి ఉంది. అకాల వర్షాలు, నిల్వ సామర్థ్యం లేక మిల్లుల్లోనే ఆరుబయట వేసే ధాన్యం బస్తాలు, మర ఆడించిన బియ్యాన్ని సకాలంలో ఎఫ్సీఐ తీసుకోకపోవడం వంటి పరిణామాల మధ్య బియ్యం నాణ్యత గగనంగా మారుతుంది. దాంతో రైతుల ధాన్యంలో బలవంతంగానైనా తూకంలో కోతలు విధిస్తూ అటు ఎఫ్సీఐకి నిబంధనల నడుమ అడ్డదారులు వెతుకున్నారు. నల్లమచ్చలు, నూకగా వచ్చిన బియ్యాన్ని ఎక్కువగా లిక్కర్ ఫ్యాక్టరీలకు, పౌల్ట్రీ పరిశ్రమకు అమ్ముకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చే 25లక్షల మెట్రిక్టన్నుల పీడీఎస్ బియ్యంలో ప్రజలు 5లక్షల మెట్రిక్టన్నులూ తినడం లేదనేది నిర్వివాదాంశం. మిగిలిన బియ్యాన్ని ప్రయివేటు వ్యక్తులతో రూ.10కి కిలోచొప్పున సేకరించడమో.. లేక రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యం మర ఆడించి ఇవ్వడమో వంటి పద్ధతుల్లో 'కష్టమ్ మిల్లింగ్' లెక్కలు చూపుతూ వస్తున్నారు. ఈ తతంగమంతా సంబంధిత అధికారుల కనుసన్నల్లోనే 'మామూలు'గా సాగుతూ వస్తోంది.
యాసంగి వరి వద్దంటే మిల్లులు మూతే!
సాధారణంగా ఏడాదిలో ఆర్నెల్లు మాత్రమే నడిచే మిల్లులు.. ఇప్పుడు యాసంగి ధాన్యం రాకుంటే మూతపడే పరిస్థితులే ఉన్నాయి. మరోవైపు పెరిగిన ధాన్యం దిగుబడితో మూడేండ్లలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 పారాబాయిల్డ్ రైస్మిల్లులు కొత్తగా ఏర్పడ్డాయి. సాధారణంగా ఒక్కో 'రా' రైస్మిల్లు ఏర్పాటుకు ఇప్పుడున్న ధరలతో పోల్చితే రూ.2 కోట్ల వరకు పెట్టుబడి అవుతుంది. అదే పారాబాయిల్డ్ మిల్లు ఏర్పాటుకు రూ.7కోట్ల మేర ఖర్చవుతుంది. ధాన్యం మర ఆడించే యంత్రానికి తోడు ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేసే బాయిలర్లు, ఇతర యంత్రాలకే సుమారు రూ.5కోట్ల వరకు ఖర్చవుతోంది. అయినప్పటికీ జిల్లాలో పెరుగుతున్న యాసంగి దిగుబడుల నేపథ్యంలో మూడేండ్లలోనే ఉమ్మడి జిల్లాలో 70 వరకు కొత్త మిల్లులు ఏర్పడ్డాయి. అందులో రాజన్నసిరిసిల్ల జిల్లాలో 17 వరకు కొత్తవి కాగా, జగిత్యాల జిల్లాలో ఏకంగా 49 వరకు కొత్తగా వెలిశాయి. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఒకట్రెండు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇప్పుడు బాయిల్డ్ తీసుకోబోమని ఎఫ్సీఐ, యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్రం పెడుతున్న కొర్రీలతో కొత్తవి, పాతవి బాయిల్డ్ మిల్లులన్నీ మూతపడే పరిస్థితే వస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు.