Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ప్రకటించిన పీఈటీ పోస్టులకు తుదిజాబితా సిద్ధంచేసి తాత్సారం చేయకుండా పోస్టింగ్లు ఇవ్వాలని భారత ప్రజాంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పీఈటీ అభ్యర్థులు సోమవారం హైదరాబాద్లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి మద్దతు డీవైఎఫ్ఐ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. సెప్టెంబర్లో పరీక్ష రాస్తే 2018, మార్చిలో ఫలితాలను విడుదల చేసిందని గుర్తు చేశారు. మేలో 1:2 నిష్పత్తి ప్రకారం టీఎస్పీఎస్సీ ఎంపిక జాబితా ప్రకటించిందని అన్నారు. కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. పీఈటీ పోస్టులను భర్తీ చేయాలంటూ ఈ ఏడాది మార్చిలో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయినా టీఎస్పీఎస్సీ తుది జాబితా ప్రకటించడం లేదని విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఖాళీలను వెంటనే భర్తీ చేసే ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పటికే నలుగురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. వెంటనే తుదిజాబితా ప్రకటించిన నియామకాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విజరుకుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, నాయకులు గుజ్జ కృష్ణ, సైదులు, భార్గవి తదితరులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి చర్చించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని తెప్పించి నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆ శాఖ కార్యదర్శిని ఆదేశించారని వివరించారు.