Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేపట్టాలి
- రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ
నవతెలంగాణ - వనపర్తి
అగ్నిపథ్ను వెంటనే రద్దు చేసి రెగ్యులర్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఎమ్మెల్యేలను మభ్యపెట్టి.. కొనుగోలు చేసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకొచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ పోతోందన్నారు. ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్తో నాలుగేండ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్మెంట్ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచడం సాధ్యం కాదన్నారు. రెండేండ్లుగా సైన్యంలో ఎలాంటి నియమకాలూ చేపట్టలేదన్నారు. శాశ్వత పద్ధతిన సైనికులను తీసుకోకుండా.. రైతు చట్టాల మాదిరిగా కుట్రలకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రకటించిన మరుక్షణమే దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరిగాయన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో జరిగిన ఆందోళనలో నిరుద్యోగి మృతిచెందడం బాధాకరమన్నారు. కొంతమందికి బుల్లెట్ గాయాలు అయ్యాయన్నారు. అందువల్ల కేంద్రం ఈ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు రూ.20 లక్షలు ఇవ్వాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచడం వల్ల రైతులు ఆందోళనకు గురౌతున్నారన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ప్రయివేట్ వ్యాపారులను ఆశ్రయించి వడ్డీలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వెంటనే రుణమాఫీ చేసి రైతులను రుణాలు అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జబ్బార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుట్టా ఆంజనేయులు, మేకల ఆంజనేయులు, లక్ష్మి, గోపి, బాల్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాజు, మహబూబ్ భాష, రాజు, ఎస్.గోపాలకృష్ణ, బాలాజీ నాయక్, ఆర్ఎం.రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.