Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొడ్డిదారిన ఉత్తర్వులు
- నిబంధనలకు యధేచ్చగా తూట్లు
- 317 జీవో అప్పీళ్లు, స్పౌజ్ కేసులను పట్టించుకోని సర్కారు
- ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ పద్ధతిలో ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయి. ఓ ఉపాధ్యాయ సంఘం నేత నల్లగొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడమే ఇందుకు నిదర్శనం. ఆయనతోపాటు మరికొంత మంది దొడ్డిదారిలో బదిలీ అయినట్టు సమాచారం. గతంలోనూ మెడికల్ గ్రౌండ్ పేరుతో కారణాలు చూపి అంతర్ జిల్లా బదిలీకి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంపైనా విమర్శలొచ్చాయి. సిద్ధిపేట జిల్లా నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు ఓ ఉపాధ్యాయురాలిని అంతర్ జిల్లా బదిలీ చేసేందుకు ఆ జిల్లా డీఈవో అభిప్రాయాన్ని విద్యాశాఖ కోరిన విషయం తెలిసిందే. ఇలా పైరవీ ద్వారా వచ్చే ఉపాధ్యాయు లు ఎక్కువ మంది రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగి రి జిల్లాలకే వస్తున్నట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన పైరవీ బదిలీలను ప్రోత్సహిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే నిబంధనలకు యధేచ్చగా తూట్లు పొడుస్తున్నదంటూ పలువురు విమర్శస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ అక్రమ బదిలీల కోసం పైరవీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ పైరవీ బదిలీల కోసం లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే దొడ్డిదారి బదిలీల ఉత్తర్వులు బయటికి రాకుండా ప్రభుత్వం, అధికా రులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
పరిష్కారం కాని 317 జీవో అప్పీళ్లు
రాష్ట్రంలో 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానికత కోల్పోయి వేరే జిల్లాలకు బదిలీ అయిన వందలాది మంది ఉపాధ్యాయులు విద్యాశాఖకు అప్పీళ్లు పెట్టుకున్నారు. కానీ ఇంత వరకూ అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇక 13 జిల్లాల్లో భార్యాభర్తలు (స్పౌజ్) బదిలీలను ప్రభుత్వం నిషేధించింది. ఆయా జిల్లాల్లోని భార్యాభర్తలైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమను కలపాలంటూఉద్యమం చేస్తున్నారు. మంత్రులు, అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. దీంతో ఆ ఉపాధ్యాయులంతా మనోవేదనకు గురవుతున్నారు. ఇంకోవైపు అండర్టేకింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్ల వందలాది మంది పేర్లు ఆ జాబితాలో లేవు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ డీఈవోల ద్వారా విద్యాశాఖ అధికారులు అండర్టేకింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల వివరాలను తెప్పించుకున్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి మరో జాబితా విడుదల చేసే అవకాశమున్నది.
అక్రమ బదిలీలు రద్దు చేయాలి : టీఎస్యూటీఎఫ్
అక్రమ బదిలీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 13 జిల్లాల భార్యాభర్తల గోడు పట్టదనీ, పలు నిబంధనలు పెట్టి పరస్పర బదిలీలకు అనుమతించబోరనీ, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత లేదనీ, కోర్టు తీర్పులను ఖాతరు చేయడం లేదనీ, స్పెషల్ కేటగిరీ అప్పీళ్లను పరిష్కరించడం లేదని విమర్శించారు. కానీ పలుకుబడి కలిగిన వారికి పైరవీ బదిలీలకు మాత్రం ఏ నిబంధనలు అడ్డురావడం లేదని తెలిపారు. స్పౌజ్కు బ్లాక్ చేసిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు పైరవీ బదిలీల వరద కొనసాగుతోందనీ, ఇది అన్యాయమని పేర్కొన్నారు. టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్రెడ్డిని నల్లగొండ నుంచి రంగారెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని విమర్శించారు. ఇంకా పలువురు ఉపాధ్యాయులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చేరారని తెలిపారు. 317 జీవో ద్వారా వేలాది మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి బాధపడుతుంటే వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కానీ 317 జీవోనే అడ్డం పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా అక్రమ బదిలీలకు తెరలేపడాన్ని ఖండించారు. అందరికీ ఒక న్యాయం, అస్మదీయులకు మరో న్యాయం సమంజసం కాదని విమర్శించారు. అక్రమ బదిలీలను రద్దు చేసి అర్హత గలిగిన అందరికీ పారదర్శకంగా సాధారణ బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం : ఎస్టీయూటీఎస్
అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్రెడ్డి డిమాండ్ చేశారు. 317 జీవో కేటాయింపు నెపంతో ప్రభుత్వం దొడ్డిదారి బదిలీలకు తెరతీయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కి మణిపాల్రెడ్డిని నల్లగొండ నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో చెప్పాలని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకే ఇటువంటి బదిలీలు జరగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పరిపాలన సౌలభ్యం ఉండి ఉమ్మడి జిల్లా పరిధిలో బదిలీలు చేపట్టాల్సి ఉండగా, అక్రమ బదిలీలు జరపడం శోచనీయమని విమరిశంచారు. అటువంటి బదిలీలన్నింటినీ వెంటనే రద్దు చేయాలనీ, లేదంటే ఎటువంటి ఉద్యమానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు.