Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగం మౌలిక విలువలు ధ్వంసం చేస్తున్న బీజేపీ
- కమ్యూనిజంతోనే ప్రజా సమస్యల పరిష్కారం
- లౌకిక భావజాల వ్యాప్తిలో కాంగ్రెస్ విఫలం
- కేసీఆర్ వైఫల్యాల సొమ్ము చేసుకునేందుకు కాషాయ యత్నం
- కొదుమూరులో డీవైఎఫ్ఐ రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు
- ప్రారంభించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ చింతకాని
రాజ్యాంగం మౌలిక విలువలు ధ్వంసం చేస్తున్న బీజేపీ.. మరోవైపు 'అగ్నివీర్' పేరుతో దేశభక్తినీ దెబ్బతీస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 'అగ్నివీర్' పేరుతో నాలుగేండ్లకే సైనికులను ఉద్యోగ విరమణ చేయించడం వెనుక బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ను బలోపేతం చేయాలన్న కుట్ర దాగుందన్నారు. ఇలా సైన్యం నుంచి వైదొలగిన యువతను ఆర్ఎస్ఎస్లో చేర్చుకుని ఓ ప్రయివేటు సైన్యాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని తెలిపారు. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరులోని జ్యోతి ఫంక్షన్హాల్లో మూడు రోజుల పాటు కొనసాగే డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రస్థాయి శిక్షణా తరగుతులను తమ్మినేని శుక్రవారం ప్రారంభించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అధ్యక్షతన 'అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్రీయ రాజకీయ పరిస్థితులు' అంశంపై తమ్మినేని వివరించారు. యువతకు రాజకీయ అవగాహన కచ్చితంగా ఉండాలని, కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ఇది చాలా కీలకమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలోపేతం అయ్యే సమయం ఆసన్నమైందన్నారు. మానవజాతి సమస్యలు తీరాలంటే సోషలిజమే సరైన మార్గమన్నారు. జీడీపీలో ఇండియా 2.50 లక్షల కోట్ల డాలర్లతో ఉండగా చైనా 16 లక్షల కోట్లు, అమెరికా 20 లక్షల కోట్ల డాలర్లతో ఉందన్నారు. అమెరికాకు చైనా చేరువ కావడంతోనే రకరకాల కుటిలయత్నాలకు పాల్పడుతోందన్నారు. దీనిలో భాగమే ఆఫ్ఘానిస్తాన్పై యుద్ధం, ఇప్పుడు ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధమని తెలిపారు. భారత రాజ్యాంగమే లక్ష్యంగా లౌకిక విలువలు, ఆర్థిక సార్వభౌమత్వం, ఫెడరల్ వ్యవస్థ, సామాజిక న్యాయాలను విచ్ఛిన్నం చేస్తూ దక్షిణాదిపై ఉత్తారిధిపత్యానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సీబీఐ, ఈడీ, కాగ్ వంటి నిఘా సంస్థలను చెప్పుచేతల్లో ఉంచుకుని దాడులు చేస్తోందని తెలిపారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం అణచివేతకు 'పెగాసెస్'ను ముందుకు తెచ్చి వ్యక్తిగత సమాచార చౌర్యానికీ పూనుకుందన్నారు. సైనికుల సరాసరి వయస్సు 32 ఏండ్లుగా ఉన్న ప్రస్తుత తరుణంలో అగ్నివీర్ పేరుతో 17-21 ఏండ్ల యువతను నింపాలనుకోవడం అవివేకమన్నారు. మరోవైపు లౌకిక భావజాలాన్ని ముందుకు తీసుకు రావడంలో కాంగ్రెస్ విఫలమవుతుందన్నారు. కేసీఆర్ వైఫల్యాలను ఆసరా చేసుకుని రాష్ట్రంలోనూ బీజేపీ పుంజుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. రోజురోజుకు టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. తరగుతుల ప్రారంభానికి ముందుకు సంఘం జిల్లా కార్యదర్శి బషీర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, బండి రమేష్, మండల కార్యదర్శి గోపాలరావు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.