Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దఎత్తున గొర్రెల రీ-సైక్లింగ్
- పేరుకు మాత్రమే కాగితాల్లో..
- గ్రామాల్లో కనిపించని జీవాలు
- అధికారులపై ఆరోపణలు..!
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పడుతోంది. అర్హులకు గొర్రెలు అందకపోగా.. వారి పేరుతో అధికారులు, దళారులు అక్రమ దందా నడుపుతున్నారు. కాగితాల్లో కాపరులకు మంజూ రైనట్టుగా ఉన్నప్పటికీ వాస్తవంగా గొర్రెల మందలు గ్రామాల్లో కనిపించడం లేదు. గొర్రెలు లేకుండానే డబ్బులు కొల్లగొడుతున్నారు. లబ్దిదారులకు అంతో.. ఇంతో సొమ్ము ఇస్తామని మభ్యపెట్టి సంతకాలు తీసుకుని ఫొటోలు తీసి గొర్రెలు లేకుండానే యూనిట్ల డబ్బులు కాజేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై యూనిట్లకు యూనిట్లు గోల్మాల్ చేస్తున్నట్టు తెలిసింది. గొర్రెల వద్ద లబ్దిదారుల ఫొటోలు తీయించి ఆన్లైన్లో పొందుపరచడంతో పాటు బీమా సైతం చెల్లించినట్టు సమా చారం. గొర్రెలను ఎక్కడ కొన్నారో అక్కడే ఒక్క యూనిట్తో అంతా రీసైక్లింగ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. డబ్బులు మాత్రమే చేతులు మారుతున్నాయి. ఇలా చాలా చోట్ల లబ్దిదారులకు అందాల్సిన నిధులు పక్కదారి పట్టాయి. కోట్ల రూపాయలు అక్రమార్కుల పాలయ్యాయి.
గొల్ల, కురుమలకు ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో ఒక్కో యూనిట్ రూ.1.75 లక్షల విలువైన గొర్రెల పంపిణీ పథకం చేపట్టింది. ఈ పథకంలో ఒక్కో యూనిట్కు 20గొర్రెలు, పొట్టేలును లబ్దిదారులకు అందజేస్తారు. ప్రభుత్వం ఒక్కో యూనిట్ ధర రూ.1.75 లక్షలుగా నిర్ణయించగా.. వీటిలో 25శాతం డబ్బులు డీడీల రూపంలో కాపరులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో 206 కిలోల దాణా కోసం రూ.3500, మిగతా బీమా, రవాణా కోసం కేటాయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏపీ నుంచి గొర్రెల కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ టీమ్ ఆయా రాష్ట్రాల్లోని ఫలానా ప్రాంతంలో కొనుగోలు చేయడానికి గొర్రెలు ఉన్నాయని సమాచారం అందిస్తుంది.
ఈ సమాచారం మేరకు స్థానిక వెటర్నరీ డాక్టర్ లబ్దిదారులతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లి గొర్రెల ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించి.. ధర నిర్ణయించి యూనిట్లను ఓకే చేస్తారు. అప్పుడు నిధుల కోసం ఆయా జిల్లాల డీవీఏహెచ్వో ఆఫీస్కు సమాచారం అందిస్తారు. జిల్లా వెటర్నరీ ఆఫీసర్లు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు పంపిస్తారు. అప్పుడే ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల యూనిట్లను రాష్ట్రానికి రవాణా చేస్తారు.
జిల్లాల వారీగా గొర్రెల పంపిణీ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 17, 641 మంది లబ్దిదారులు నమోదు చేసుకోగా.. రూ.200 కోట్లతో 17,257 మందికి గొర్రెలను అందించారు. రెండో విడతలో 17,622 మంది లబ్దిదారులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా అందించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడతలో 16 వేల 5 మంది లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14,756 యూనిట్లను అందించారు. ఇందుకోసం అధికారులు రూ.184 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతలో 15,844 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1499 మందికి 18.74 కోట్ల రూపాయలతో యూనిట్లు అందించారు. మరో 243 మందికి పెరిగిన యూనిట్ కాస్ట్ ప్రకారం రూ.4.25 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతలో భాగంగా గతేడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 16న గొర్రెలు పంపిణీ చేస్తున్నట్టు లాంఛనంగా ప్రారంభించినా.. పూర్తిస్థాయిలో లబ్దిదారులకు పంపిణీ చేయలేదు. నల్లగొండ జిల్లాలో 32668 మంది దరఖాస్తు చేసుకోగా, 28244 యూనిట్లు అందించారు. సుమారు 280 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
రీ సైక్లింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు
రాయితీ గొర్రెలకు సంబంధించి అనేక చోట్ల రీ-సైక్లింగ్ జరుగుతున్నట్టు ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఏపీలో గొర్రెలను కొనుగోలు చేసి వాటికి ఇన్సూరెన్స్ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి వాహనాల ద్వారా ఆయా జిల్లాలకు పంపించాల్సి ఉంటుంది. కానీ ఆ గొర్రెలు జిల్లాకు వచ్చే అవకాశమే లేదు. ఒక యూనిట్ను కొనుగోలు చేసిన చోటు నుంచే అనేక అక్రమాలకు తెరలేపు తున్నట్టు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ ట్యాగులను స్వయంగా అధికారులే కత్తిరించి, అవే గొర్రెలకు వేరే ట్యాగులు తగిలించి రీ-సైక్లింగ్ చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అక్ర మాలు బయటపడకుండా ఈ పథకం అమలుపై ఆడి టింగ్ కోసం వచ్చిన అధికారులకు స్థానిక అధి కారులు, దళారులు కలిసి విందులు, వినోదాలు చేసుకుని భారీగానే నగదును ముట్టజెప్పినట్టుగా తెలుస్తోంది.
రూ.75వేలు ఇచ్చి గొర్లు లేవన్నరు
కారంపూడి నుంచి భువనగిరికి వేరే వాళ్లకు తీసుకొచ్చిన గొర్రెల ట్యాగులు కత్తిరించి మాకు ఇస్తన్నరు. అట్ల మాకు వద్దన్నం.. వద్దంటే గొర్రెలు లేవు.. మీకు రూ.75వేలిస్తం.. తీసుకుని వెళ్లిపొమ్మన్నరు. చేసేది లేక డబ్బులు తీసుకుని వచ్చినం. నాతోపాటుగా దాదాపు 30మందికి ఇట్లనే ఇచ్చిన్రు. ఇట్లెట్లా ఇస్తరు. మాకు షేడ్లు ఉన్నరు, భూములున్నారు గొర్రెలు ఇస్తరని ఎంతో ఆశపడ్డం.
- గుండెబోయిన దానయ్య,
తుక్కాపూర్- భువనగిరి మండలం.
ఎక్కడి గొర్రెలు అక్కడే అమ్మకాలు
ప్రభుత్వం ఇస్తున్న గొర్రెలు ఎక్కడ కొనుగోలు చేసిన వాటిని అక్కడే అమ్మకాలు చేస్తున్నారు. 90శాతం అక్కడే అమ్మేస్తున్నారు. మరో 10శాతం గొర్రెలు మాత్రం లబ్దిదారుడి ఊరికి వస్తున్నాయి. ఇందులో అధికారులు, దళారులు భాగస్వామ్యమై జరుగుతున్న తంతు. లబ్దిదారులకు జరుగుతున్న మేలు శూన్యం.
- దయ్యాల నర్సింహ్మ,
జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు యాదాద్రి భువనగిరి.
రీసైక్లింగ్ తమ దృష్టికి రాలేదు
జిల్లాలో గొర్రెల రీసైక్లింగ్ అయినట్టుగా తమ దృష్టికి రాలేదు. ఎక్కడైనా జరిగితే అధికారుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. వీలైన చోట ప్రజాప్రతినిధులను పిలిచి మరీ గొర్రెలను పంపిణీ చేస్తున్నాం. ఎక్కడా దాపరికం లేదు.
- శ్రీనివాస్రావు,
పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి- నల్లగొండ.