Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ' సికింద్రాబాద్ రైల్వే' ఘటనపై దర్యాప్తులో సుబ్బారావు
- మరో ముగ్గురు అనుచరుల అరెస్టు.. రిమాండ్ :
- రైల్వే ఎస్పీ అనురాధ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తాను నడుపుతున్న డిఫెన్స్ అకాడమిలకు అగ్నిపథ్ పథకం ద్వారా కోట్ల రూపాయల నష్టం వస్తుందనే రైల్వే విధ్వంసానికి ఊతమిచ్చానని కుట్రదారుడు ఆవుల సుబ్బారావు దర్యాప్తులో వెల్లడించాడు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావుతో సహా శివకుమార్, బేసిరెడ్డి, మల్లారెడ్డి అనే మరో ముగ్గురు అనుచరులను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఆమె చెప్పారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బారావు, ఆయన ముగ్గురు అనుచరుల అరెస్టు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. 2011 లో ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఆవుల సుబ్బారావు ఏపీలోని గుంటూరు జిల్లా నర్సారావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమిని తెరిచాడు. ఆర్మీ ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేవాడు. ముఖ్యంగా, ఆర్మీ ర్యాలీ అయ్యాక అందులో నెగ్గినవారిని తదుపరి శిక్షణ నిమిత్తం తన అకాడమిలో చేర్చుకునేవాడు. చేరే సమయంలో ఫీజు ఎక్కువగా డిమాండ్ చేయని సుబ్బారావు.. ఆర్మీలో ఉద్యోగం వచ్చాకే వారి నుంచి రూ. 3 లక్షలు వసూలు చేసేవాడు. ఈ ప్రక్రియ పూర్తేయ్యేంత వరకు తన వద్ద జమానతు కింద వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకునేవాడు. ఈ విధంగా గుంటూరుతో పాటు మొత్తం ఆంధ్ర, తెలంగాణ లలో ఎనిమిది అకాడమిలో తెరిచిన సుబ్బారావు.. అనుచరులను నియమించుకొని ఆర్మీ ఉద్యోగార్థుల నుంచి లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్నాడు.
ఈ ఏడాది 2019లో కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం శిక్షణనివ్వటానికి వందలాది మంది ఉద్యోగార్థులను చేర్చుకున్న సుబ్బారావుకు.. కరోనా శరాఘాతమైంది. ఫలితంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయింది. రెండేండ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరగకపోవటంతో.. తమ వద్ద క్వాలిఫై జరిగి ప్రధాన పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈనెల 14న కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అశనీపాతమైంది. దీంతో ఈ పథకం వలన తాను కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నాననే ఆగ్రహంతో ఉన్న సుబ్బారావుకు హర్యానా, బీహార్, యూపీలలో ఆర్మీ ఉద్యోగార్థులు జరిపిన రైల్వే విధ్వంసం ప్రేరణ కల్పించింది. దాంతో తాను కూడా ఇక్కడి ఆర్మీ ఉద్యోగార్థులతో రైల్వేలో భారీ విధ్వంసానికి పాల్పడాలని వ్యూహ రచన చేశాడు.
ఇందులో భాగంగానే తన అనుచరులతో ఎనిమిది వాట్సప్ గ్రూపులను తయారు చేసి అందులో రెండు వేల మందికి పైగా అభ్యర్థులను చేర్చుకొని 'ఛలో సికింద్రాబాద్', 'సికింద్రాబాద్ బ్లాక్' అనే కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. ఈ నెల 16న బోడుప్పల్లోని జీవీఎస్ గ్రాండ్ లాడ్జ్లో బస చేసిన సుబ్బారావు అక్కడి నుంచి తన అనుచరులైన శివకుమార్, బేసిరెడ్డి, మల్లారెడ్డిలకు సికింద్రాబాద్కు ఆందోళనకారులను సమీకరించటం, రైల్వే స్టేషన్లో ఏ విధంగా విధ్వంసానికి పాల్పడాలో వివరించటం, బోగీలు, ఇంజిన్లను ఏ విధంగా తగల బెట్టాలో అనుచరుల ద్వారా ప్రేరేపించటం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ముఖ్యంగా, బేసిరెడ్డి, శివకుమార్, మల్లారెడ్డి లు తమ బాస్ సుబ్బారావు ఇస్తున్న ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి పాల్పడ్డారు. తగలబెట్టటానికి అవసరమైన పెట్రోల్, కర్రలను సమీకరించటం, తన సన్నిహిత అనుచరులకు టీ, టిఫిన్ల ఖర్చులకు రూ. 35 వేలను కూడా సుబ్బారావు.. బేసిరెడ్డికి అందజేశాడు. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టామని ఆమె చెప్పారు.