Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హమాలీ కార్మికుల ఉపాధి కాపాడాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను వెంటనే ఎఫ్సీఐ ద్వారా కొనాలనీ, హమాలీ కార్మికుల ఉపాధి కాపాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ బియ్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో 1500 మిల్లులు మూతపడ్డాయని తెలిపారు. సుమారు 2 లక్షల మంది హమాలీ కార్మికులతో పాటు మిల్లు డ్రైవర్లు, దినసరి కూలీలు, గుమస్తాలు, ట్రాన్స్పోర్టు డ్రైవర్లు ఇతర ఆధారిత కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు పనుల్లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రైస్మిల్లు వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోయిందని పేర్కొన్నారు. మిల్లుల యాజమాన్యులు రెండు సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరించినప్పటికీ, వాటిని బియ్యంగా మార్చి అమ్మక పోవడంతో రైస్ మిల్లు యాజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం సరఫరా చేయకుండా మధ్యలో మానేయటం వల్లనే ఈ స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా రాష్ట్రం చెబుతూ దోబూచిలాడటం వల్లనే ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కస్టం మిల్లింగ్ రైస్ బియ్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయించాలనీ, హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.