Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
- రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి
నవతెలంగాణ-కోదాడరూరల్
నాగార్జునసాగర్ నీటిపారుదల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ శీలబోయిన సత్యనారాయణ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సత్యనారాయణ(86) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం మృతిచెందారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయానికి శ్రీనివాసరావు, జూలకంటి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ, కుడి, ఎడమ కాలువల డిజైన్ చేయడంలోనూ సత్యనారాయణ పాత్ర మరువలేనిన్నారు. నాగార్జునసాగర్- హాలియా రోడ్డు నిర్మాణంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఉమ్మడి ఏపీలో చీఫ్ ఇంజినీరుగా పని చేస్తున్న సమయంలో ఈ ప్రాంత నీటిపారుదల శాఖలకు ముఖ్య సలహాదారులుగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డ్యాం డిజైనింగ్లో ముఖ్యమైన ముగ్గురు ఇంజినీర్లలో సత్యనారాయణ ఒకరని చెప్పారు. మీడియం నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్గా రిటైర్డ్ అయ్యారన్నారు. ఆయన రిటైర్డ్ కాకముందు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం 13 ఏండ్లు చీఫ్ మీడియం ఇంజినీర్గా పని చేశారని చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధ్యయనం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. రోజుకు 16 గంటలు పనిచేసేవారని కొనియాడారు. సీపీఐ(ఎం)తో, రైతుసంఘం నాయకులతో ఆయనకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయన్నారు.
అదేవిధంగా గిరిజన ప్రాంతంలోని 32 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కలిగించే జలధార ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. ఆయన స్వయంగా ప్రయివేట్ సంస్థలను కలిసి అనేక గిరిజన గ్రామాలు తాగునీరు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి.. ఆ సంస్థలు ఇచ్చిన గ్రాంట్తో తాగునీటి సదుపాయం కల్పించారన్నారు. ఎక్కడో కొండల్లో నుంచి వచ్చే నీటిని గ్రామాల్లోకి 360 రోజులు 24 గంటలు సరఫరా అయ్యేలా ఏర్పాటు చేశారని చెప్పారు. అరకులో శారదా నికేతన్ అనే పాఠశాలలో వెయ్యి మంది పిల్లలను చదివిస్తున్నారన్నారు. అక్కడ హాస్టల్ సౌకర్యం కూడా కల్పించడానికి సత్యనారాయణనే మూలకారణమన్నారు. ఈయన కోదాడ ప్రముఖ కంటి డాక్టర్ అశోక్కుమార్ సోదరుడని తెలిపారు.అంత్యక్రియల్లో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు నర్సింగరావు, రైతుసంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు, ఏఈ సత్యనారాయణరావు, నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాస్రెడ్డి,బసవయ్య, ముత్యాలు, వీరాంజనేయులు, వెంకట్రెడ్డి, సైదులు, దాసరి శ్రీను పాల్గొన్నారు.సత్యనారాయణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ రాజకీయ నాయకులు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు సంతాపం తెలిపారు. కోదాడలోని ప్రముఖ డాక్టర్లు, బంధు మిత్రులు తమ సంతాపం, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.