Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరమైతే గాంధీభవన్ను ముట్టడిస్తాం
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి హెచ్చరిక
- ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడికి ఖండన
- రేవంత్రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి తీవ్రంగా ఖండించారు. దాడులు చేస్తూ చూస్తూ ఊరుకోబోమనీ, అవసరమైతే గాంధీభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తక్షణమే స్పందించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్, తెలంగాణ గిరిజన సంఘం, టీపీఎస్కే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని వివరించారు. పోలీసులపైనా, కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకుల మీద టమాటాలు విసిరారని చెప్పారు. దాడులకు పాల్పడి, కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్ను ధ్వంసం చేయాలనే కుట్రలో భాగంగానే ఇది జరిగిందని విమర్శించారు. కేరళలో రాహుల్ గాంధీ కార్యాలయం మీద దాడికి పాల్పడిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను తమ సంఘం నుంచి తొలగించినట్టు కేరళ రాష్ట్ర కమిటీ ప్రకటించిందని గుర్తు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ అంశంపై స్పందించారని చెప్పారు. అయినా ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో మోడీ ప్రభుత్వ హయాంలో మతోన్మాద రాజకీయాలు, విద్యా కాషాయీకరణ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న తరుణంలో విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందన్నారు. గతంలో కేరళలో ఎస్ఎఫ్ఐ కార్యకర్త ధీరజ్ చనిపోయినప్పుడు కానీ మొన్న విమానంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్ మీద ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడులకు పాల్పడినప్పుడు ఆ నాయకుల మీదకానీ, వారి కార్యాలయాల మీదకానీ ఎస్ఎఫ్ఐ దాడులకు పాల్పడలేదని గుర్తు చేశారు. దీన్ని ఈ రెండు సంఘాల మధ్య తేడాను చూడాలన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్బాబు మాట్లాడుతూ ఇలాంటి దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ దాడుల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్కే కన్వీనర్ హిమబిందు, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావేద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి రవి, హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, అశోక్ రెడ్డి, ఓయూ కార్యదర్శి రవి, నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.