Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనాలన్నా, అమ్మాలన్నా అనుమతి అవసరం
- పాఠశాల విద్యాశాఖ ఆదేశం
- సర్కారు తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
- వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం
- టీచర్ల ఆస్తుల వివరాల ఆదేశాలు నిలిపివేత
- ఉత్తర్వులివ్వాలంటూ విద్యాశాఖకు మంత్రి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులు వార్షిక ఆస్తుల వివరాలను సమర్పించాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థిర, చర ఆస్తుల వివరాలను ఇవ్వాలని కోరింది. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆస్తుల వివరాలను తెలపాలంటూ ఈనెల ఎనిమిదో తేదీన పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని అందులో స్పష్టం చేసింది. ఇకపై టీచర్లు ఇండ్లు, ప్లాట్లు కొనాలన్నా, అమ్మాలన్నా సంబంధిత అధికారుల నుంచి ముందే అనుమతి పొందాలని కోరింది. కేవలం ఇండ్లు, ఫ్లాట్లకు సంబంధించిన లావాదేవీలే కాకుండా బంగారం, ఆభరణాలు, ఇతర ఖరీదైన వస్తువులు ఏవి కొనాలన్నా సంబంధిత అధికారికి వివరాలు సమర్పించాల్సిందేనని ఆదేశించింది. లేదంటే ఆయా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీచర్లందరూ వార్షిక ఆదాయ నివేదికను విద్యాశాఖకు ఏటా సమర్పించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి టీచర్లు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది.
ఆ సర్క్యులర్ అమలు నిలిపివేత
ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలను సమర్పించాలన్న ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించాయి. ఉపాధ్యాయులు సైతం ఆందోళనకు గురయ్యారు. దీన్ని గమనించిన ప్రభుత్వం ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వార్షిక ఆస్తుల వివరాలను అందజేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిలిపివేతకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలంటూ విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉపాధ్యాయులను దొంగలుగా చిత్రీకరించడం సరికాదు : చావ రవి, టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
ఉపాధ్యాయులను దొంగలుగా చిత్రీకరించడం సరైంది కాదు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలు కొత్తదేమీ కాదు. 1964 సివిల్ సర్వీస్ కాండక్ట్ నిబంధనల్లోనే ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ వర్తిస్తుంది. బడికి రాకుండా ఎగ్గొట్టే ఉపాధ్యాయులను నిరోధించడానికి ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు పరిష్కారం కాదు. రియల్ఎస్టేట్, చిట్ఫండ్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడే ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఉపాధ్యాయులందరూ వ్యాపారాలు చేస్తున్నారని చెప్పడం సరైంది కాదు. ఇది ఉపాధ్యాయులను అప్రతిష్టపాలు చేయడమే అవుతుంది.
అసంబద్ధ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి -ఎస్టీయూటీఎస్
ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేయడాన్ని ఎస్టీయూటీస్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్టీయూటీస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, ఎం పర్వతరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలల్లో మౌలిక వసతులు కల్పించాలనీ, ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉద్యమ కార్యాచరణకు సన్నద్దమౌతున్న తరుణంలో ప్రభుత్వం ఇటువంటి ఉత్తర్వులు విడుదలచేయడం ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. ఏ ఒక్కరినో సాకుగా చూపుతూ ఇటువంటి ఉత్తర్వులను విడుదల చేయడం ఉపాధ్యాయులను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.