Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్లపై ఆంక్షలను ఎత్తేయాలి
- సీఎం కేసీఆర్కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. మునుగోడు శాసనసభ ఉపఎన్నిక సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. వివిధ సందర్భాల్లో సంబంధిత శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మెన్కు కూడా వివరించామని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ అధికారులు చర్చించినట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఇది జరిగి నెల రోజులు కావస్తున్నదని తెలిపారు. ఇప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతున్నదని పేర్కొన్నారు. 'ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలను ఎత్తేసి కార్యకలాపాలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. 2017, 2021 వేతన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని కోరారు. గతంలో చేసిన వేతన ఒప్పంద బకాయిలను చెల్లించాలని సూచించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల నుంచి రికవరీ చేసిన రూ.850 కోట్లను సీసీఎస్కు తక్షణమే చెల్లించాలని వివరించారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.