Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.6,800 కోట్లతో టెండర్ల ఆహ్వానం
- సింగరేణి సీఎమ్డీ ఎన్ శ్రీధర్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి కాలరీస్ రూ.6,800 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి టెండర్లు పిలిచినట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. మంగళవారంనాడాయన సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ నెలాఖరు లోగా 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభించాలనీ, మార్చిలో మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్ను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికోసం పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం దేశవ్యాప్త టెండర్లు పిలిచామన్నారు. కొత్త ప్లాంట్ ను ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1,200 మెగావాట్ల ప్లాంటు ఆవరణలోనే నెలకొల్పబోతున్నారు. ప్రస్తుత ప్లాంట్కు గల బొగ్గు రవాణా, నీటి వసతులను ఈ కొత్త ప్లాంట్కు కూడా వినియోగించుకునే అవకాశం ఉన్నందున కొత్త ప్లాంట్కు అదనంగా ఈ రెండింటి విషయంలో నిర్మాణ వ్యయం తగ్గుతుందనీ ఆయన చెప్పారు. అలాగే ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రం వాటర్ రిజర్వాయర్లో నిర్మాణంలో ఉన్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై కూడా సమీక్ష చేశారు. మొత్తం 66 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ ప్లాంట్లు నిర్మాణం చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. రామగుండం-3 ఏరియాలోని ఓపెన్ కాస్టు-1 ఓవర్ బర్డెన్ డంప్పైన తొలిసారిగా నిర్మిస్తున్న 22 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కూడా ఉందనీ, మిగిలిన వాటిలో చెన్నూరు ప్రాంతంలో 11 మెగావాట్లు, కొత్తగూడెంలో 33 మెగావాట్ల ప్లాంట్లు ఉన్నాయనీ, వీటికి టెండర్ ప్రక్రియ పూర్తయినందున పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్ కుమార్ సుర్, చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జె.ఎన్.సింగ్, ఎస్టీపీపీ జనరల్ మేనేజర్ డి.వి.ఎస్.ఎస్.ఎన్.రాజు, జీఎం(సోలార్) ఎస్.జానకిరామ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్.వి.కె.విశ్వనాథ రాజు, ఏజీఎం(సివిల్) కె.ఎస్.ఎన్.ప్రసాద్, ఏజీఎం(ఫైనాన్స్) సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.