Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్వి వెంకటేష్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లాంగ్జంప్ దూరాన్ని 3.8 మీటర్ల నుంచి నాలుగు మీటర్లకు పెంచడంతో అనేక మంది అభ్యర్థులు నష్టపోతున్నారని విమర్శించారు. పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు సివిల్, కమ్యూనికేషన్, ఫైర్, జైల్, ఎక్సైజ్ విభాగాల్లో మెయిన్స్కి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లాంగ్జంప్లో ఆన్ ద లైన్ జంప్ని అనుమతించాలని కోరారు. డిజిటల్ విధానాన్ని తీసేసి, పాత పద్ధతిలోనే మ్యానువల్గా అభ్యర్థుల ఎత్తు కొలతలను తీసుకోవాలని సూచించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రిలిమ్స్లో ఏడు మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్డీ జావెద్, అభ్యర్థులు జ్యోతి, విజయలక్ష్మి, మహేష్, నరేష్, సాయి, ఈశ్వర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.