Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరువు నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కింద అడిగిన ప్రతికూలీకి పనులివ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.వెంకట్, ప్రధాన కార్యదర్శి జి.నాగయ్య డిమాండ్ చేశారు. పనుల్లేక కూలీలు అవస్థపడుతుంటే, కరువుకు, ఉపాధి పనులకు కేంద్ర ప్రభుత్వం లింకుపెట్టడాన్ని ఖండించారు. తద్వారా కాలయాపన చేయడం సరికాదన్నారు. 100 రోజుల పనిదినాలకు తోడు, కరువు ప్రాంతాలకు మాత్రమే వర్తించేలా అదనంగా 50 రోజుల పనిదినాలు పెంచుతామనడం ఎంతమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జాబ్కార్డులు పొందినవారు 1.30 కోట్ల మంది ఉన్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానం వలసలను పెంచుతుందని, పేదలను మరింత పేదలుగా మారుస్తుందన్నారు. వామపక్షాల ఒత్తిడి మేరకు యుపిఎ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చిన సంగతిని గుర్తు చేశారు. కరువు నివేదికతో సంబంధం లేకుండా తక్షణమే ప్రతి కూలీకి 200 రోజుల పనులు కల్పించాలని, రోజూ కూలీ రూ.300 చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.