Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చౌక దుకాణాల్లో అక్రమాలు జరిగితే డీలర్షిప్ రద్దు చేస్తాం
- సన్నాలకు బదులు దొడ్డుబియ్యం
సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు : మంత్రి ఈటల
- టోల్ఫ్రీ నెం.1967కి ఫిర్యాదు చేయండి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కందిపప్పు అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. కేంద్రం సహకరిస్తే ఉల్లిగడ్డ మాదిరిగా కందిపప్పును కూడా విక్రయిస్తామన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.200 లభించే కందిపప్పును రేషన్ దుకాణాల్లో కిలో రూ.50కే పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు వివరించారు. సోమవారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డాక్టర్ రజత్కుమార్తో కలిసి మంత్రి విలేక రులతో మాట్లాడారు. కందిపప్పు బ్లాక్ మార్కెట్కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇక నుండి సీజన్లో కందిపప్పును ఒకేసారి కొనుగోలు చేస్తామన్నారు. చౌక దుకాణాదారులు అక్రమాలకు పాల్పడితే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఉద్ఘాటించారు. ధాన్యం కొన్న 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించేలా చూస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో రైతుల కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే డబ్బు ఇవ్వాల న్నారు. ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేయకుండా అదికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాలు, పాఠశాలలకు పంపిణీ చేసే సన్నబియ్యంలో నాణ్యతపై రాజీపడే ప్రసక్తేలేదన్నారు. సన్నబియ్యం స్థానంలో దొడ్డు బియ్యం సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమార్కులు కోర్టుల్లో స్టే తెచ్చుకోకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. త్వరలోనే సన్నబియ్యంపై రిటైర్డ్ ఐపీఎస్తో కూడిన విజిలెన్స్ కమిటీని వేస్తామన్నారు. నెల్లూరు బియ్యాన్ని కాకుండా బీపీటీ బియ్యాన్నే వాడాలని అధికా రులకు సూచించారు. ఏళ్లుగా పాతుకుపోయిన స్టేజ్-1 కాంట్రాక్టర్లను తొలగించి కొత్తవారిని ఎంపిక చేస్తామన్నారు. పౌరసరఫరాల శాఖలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నెం.1967కి గానీ, విజిలెన్స్ సెల్కి గానీ ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిని అధికారులను సస్పెండ్ చేశామని.. త్వరలో మెదక్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయనున్నట్టు తెలిపారు. కాగా కేంద్రం అందించే కందిపప్పును కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను కొట్టివేశారు.