Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ, విదేశాల నుండి 600 మంది శాస్త్రవేత్తలు హాజరు
- రైతులకు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో తొలి సారీగా ఓ జాతీయ విత్తన సదస్సుకు వేదిక అవుతుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మాదాపూర్లోని హెచ్ఐసిసి, నోవాటెల్ క్యాంపస్లోకి జాతీయ విత్తన సదస్సు ప్రారంభం కానుంది. జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్లను కేంద్ర వ్యవసాయశాఖ ఉప కార్యదర్శి కె త్రివేది పర్యవేక్షిస్తున్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుండి 600 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, విత్తన కంపెనీల యజమానులు పాల్గొననున్నారు. విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించేందుకు 75 మంది రైతులను కూడా ఆహ్వానించారు. దేశ విత్తనోత్పత్తిలో 60 శాతం విత్తనోత్పత్తి తెలంగాణ రాష్ట్రం నుండే జరుగుతుంది. ఈ విత్తన సదస్సు ద్వారా విత్తనోత్పత్తిలో రాష్ట్రం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2.50 లక్షల హెక్టార్లలో 2 లక్షల మంది రైతులు విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా విత్తనోత్పత్తిపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతుల కోసం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి అనువైనదిగా ఉంది. ఈ సదస్సు ద్వారా విత్తనోత్పత్తిలో మరింత పరిణతి పొంది ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 216 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండిస్తున్నారు. మంచి విత్తనాలతోనే ఉత్పాదకత పెరుగుతుందని, మరింత మేలైన విత్తనాలను తయారు చేయడానికి విత్తన సదుస్స దోహద పడుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
విత్తన భాండాగారంగా తెలంగాణ - మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ విత్తన సదస్సు జరగడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 36వేల హెక్టార్లలో విత్తనోత్పత్తి జరుగుతోందని, విత్తన సదస్సు తర్వాత రైతులకు అనుకూలంగా స్టేట్ సీడ్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఈ సదస్సులో రైతుల సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాదిలో 70వేల క్వింటాళ్ల సోయాబిన్ విత్తనాలను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి 2.50 లక్షల క్వింటాళ్ల సోయాబిన్ విత్తనాలు అవసరమన్నారు. రాష్ట్రంలో మూత పడ్డ 11 సీడ్ కంపెనీలను పున:ప్రారంభించడానికి రూ.9కోట్లు విడుదల చేశామన్నారు.
ఈ ఏడాదిలోనే రుణమాఫీ పూర్తి
రైతుల రుణమాఫీకి సంబంధించి మంత్రి మాట్లాడుతూ రుణాలన్నిటినీ ఏకమొత్తంలో ఈ ఏడాదిలోగా చెల్లిస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోగా చెల్లిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా అవును.. ఈ ఏడాదిలోనే చెల్లిస్తామని సమాధానం ఇచ్చారు. బ్యాంకుల చెల్లించాల్సిన రూ.8500 కోట్లను ఒకేసారి చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, నివేదిక అందిన వెంటనే కరువు మండలాలను ప్రకటిస్తామన్నారు. జూన్2 నుండి పంట నష్టం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.