Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కె. తారకరామారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాటర్గ్రిడ్ తొలి ఫలితాలు వచ్చే ఆరు నెలల్లో రానున్నాయని పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఆర్డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడు వేల జనావాసాలకు త్వరలో తాగునీటిని అందిస్తామని ప్రకటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు వైపు చూస్తున్నాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు సైతం వాటర్గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి కనపరుస్తున్నాయని వివరించారు. కచ్చితమైన లక్ష్యాలతో పనిచేస్తేనే వాటర్గ్రిడ్ ఉద్దేశ్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పటిలోగా నీళ్లిచ్చేది ఆయా ప్రాంత ప్రజలకు చెప్పాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై త్వరలో ముఖ్యమంత్రి విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ 30 నాటికి గజ్వేల్ నియోజకవర్గానికి నీళ్లు ఇస్తామని తెలియజేశారు. ఆ తరువాత మేడ్చల్తోపాటు నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు నల్లా నీళ్లు ఇంటింటికి అందుతాయని వివరించారు. సెగ్మెంట్లు, మండలాలవారీగా ఏఏ తేదీ నాటికి తాగునీరిస్తామనే సంగతిని నివేదిక రూపంలో ఇవ్వాలని ఎస్ఇ. ఇఇ లను ఆదేశించారు. దాని ఆధారంగానే పనులు చేయాలని, ఆ నివేదికనే బైబిల్, భగవద్గీతలా భావించి పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అలాగే అటవీ అనుమతులు, భూసేకరణ పనులు ఎంత వరకు వచ్చాయంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన జిల్లా సంయుక్త వర్కింగ్ గ్రూపుల సమావేశాలు ఎలా జరుగుతున్నాయనే విషయమై ఆరా తీశారు. ప్రధాన పైపులైన్లతోపాటు ఆయా గ్రామాల అంతర్గత పైపులైన్ల పనులను కూడా వేగంగా పూర్తిచేయాలని కోరారు. హైదరాబాద్ కేంద్రంగా చేయాల్సిన డిజైన్లు, టెండర్ల పనులు పూర్తయిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పనులపై పూర్తిస్థాయి దృష్టిసారించాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈసమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జె.రేమాండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ సలహాదారు జానేశ్వర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సురేందర్రెడ్డి పాల్గొన్నారు.