Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న ఆశాల సమ్మె
నవతెలంగాణ-యంత్రాంగం
ఆశాల సమ్మె కొనసాగుతున్నది. సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. మరికొన్ని చోట్ల మంత్రుల, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇంకొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కి ఆశాలు నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని ఏకశిలాపార్కు వద్ద ఆశాల సమ్మె కొనసాగుతున్నది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్స్ ద్వారా సిఎంకు ఆశాలు లేఖ పంపారు. తొర్రూరులో ఆశాలు బిల్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఆశాలు వినతిపత్రమిచ్చారు. రామన్నపేటలో ప్రభుత్వ ఏరియాస్పత్రి భవనం ఎక్కి ఆందోళన చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట పడుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వేంసూరులో దీక్షా శిబిరంలో సిఐటియు జెండాలు చేబూని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆశావర్కర్లు మంత్రి ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. చెన్నూరు, జన్నారం, మామడలలో కండ్లు మూసుకుని నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో ఆశాలు ఖోఖో ఆడారు. రెంజల్లో పిహెచ్సి ఎదుట ధర్నా చేశారు. కరీంనగర్లో నోటికి గుడ్డలు కట్టుకుని ఆశాలు నిరసన తెలిపారు. జమ్మికుంటలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆశాలు ఆకాశం వైపు నమస్కారాలు చేసి నిరసన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖిల్లా ఘనపురంలో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. అలంపూర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో మంత్రి హరీష్రావును ఆశాలు అడ్డుకున్నారు. జహీరాబాద్లో భిక్షాటన చేసి, రామాయంపేటలో ముక్కు మూసుకుని నిరసన తెలిపారు. జోగిపేటలో తహసీల్దార్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి, అల్వాల్ ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఆశాలు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. హయత్నగర్ మండలాభివృద్ధి కార్యాలయం ముందు ఆశాలు కబడ్డీ ఆడారు.
సమ్మె విరమిస్తేనే చర్చలు : మంత్రి హరీష్
'సమ్మె చేస్తే నిర్ణయం తీసుకో లేం. ఇప్పటికే నన్ను ఆరుసార్లు అడ్డుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సమ్మె విరమిస్తేనే చర్చలు జరుపుతాం. శాంతియుతంగా వస్తే నే సమస్యలు పరిష్కారం అవు తాయి' అని రాష్ట్ర భారీ నీటిపారు దల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో ఓ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని ఆశాలు అడ్డుకున్నారు. ఇన్ని రోజులగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి ఎదుట ఆశాలు ఆవేదన వ్యక్తం చేయగా మంత్రి ఇలా వ్యాఖ్యానించారు.