Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేస్తూ నీటిపారుదల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు పనుల్లో వివిధ దశల్లోని ఐదు ప్యాకేజీల్లో మార్పులు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మిడ్మానేరు నుంచి కొమరెల్లి మల్లన్న ప్రాజెక్టుల మధ్య గల 6,7,8,10,11,12 ప్యాకేజీల్లో ఈ మార్పులు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి జారీ చేసిన ఉత్తర్వుల్లో వివరించారు. నిపుణుల కమిటి సిఫార్సుల మేరకు ఈ మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. జలయజ్ఞంలో భాగంగా గత ప్రభుత్వం రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు పనుల్లో భారీ మార్పులను చేయలని ఇటీవల ముఖ్యమంత్రి సూచించారు. దీనిలో భాగంగా మిడ్మానేరు కింది భాగంలోని తడకలపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల సామర్ధ్యాన్ని పెంచడాలని ప్రభుత్వం నిర్ణయించింది. తడకలపల్లి రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 40 టిఎమ్సిలకు, పాములపర్తి రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 20 టిఎమ్సిలకు పెంచాలని నిర్ణయించడంతో దీనికి అనుగుణంగా వివిధ ప్యాకేజీల్లో మార్పులు చేయాలని నిపుణుల కమిటి సూచించింది. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం సర్వే, డిపిఆర్ తయారు చేసే బాధ్యతను వ్యాప్కోస్కు అప్పగించింది. దీనిలో భాగంగా లైడార్ సర్వే కూడా చేశారు. ప్రాజెక్టు ఎక్కడ నిర్మించినా ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టుల కింద పనులను ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా చేసిన మార్పులతో రెండేండ్లలో ఈ పనులు పూర్తిచేయాలని ఆ ఉత్తర్వులో ప్రభుత్వం ఆదేశించింది.
తోటపల్లి రిజర్వాయర్ రద్దు..
ప్రాణహితతో అనుసంధానం
ప్రాణహిత ప్రాజెక్టు ప్యాకేజీ పనుల్లో చేసిన మార్పులో భాగంగా తోటపల్లి రిజర్వాయర్ ఆయకట్టుకు కూడా మిడ్మానేరు నుంచి నీటిని అందించడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. శ్రీరామ్సాగర్ వరద కాల్వ కింద కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామం వద్ద ఈ రిజర్వాయర్ను ప్రతిపాదించారు. జలయజ్ఞంలో భాగంలో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కేవలం 0.95 టిఎమ్సిల నీటితో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు కు ఇంత భారీ మొత్తంలో ఖర్చుపెట్టడం సహేతుకం కాదని నిపుణుల కమిటి తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద 49,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రాణహితతో తోటపల్లి కింద ప్రతిపాదించిన ఆయకట్టును అనుసంధానం చేయడానికి నిపుణుల కమిటీ సూచించింది. ఇప్పటికే ఈ రిజర్వాయర్ కోసం 1500 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. రిజర్వాయర్ నిర్మాణం వల్ల మూడు గ్రామాలు ముంపుకు గురవుతాయి.