Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఎం ఆధ్వర్యంలో అడ్డగింత
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయనే నెపంతో కూల్చివేసేందుకు రెవెన్యూ అధికారులు మంగళవారం ప్రయత్నించగా సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు అధికారులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని వెనుదిరగడంతో స్థానికులు శాంతించారు. ఎన్ఎస్పి క్యాంప్లో దాదాపు 277 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరంతా 30 ఏండ్లుగా ఎన్ఎస్పిలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే రిటైర్డయ్యారు. రిటైర్డు, సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు కనీస ధరకు భవనాలను శాశ్వతంగా కేటాయించాలని పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. మరోవైపు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని ఖాళీ చేయాలని కార్పొరేషన్ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయినా ఎవ్వరూ ఖాళీ చేయలేదు. దీంతో మంగళవారం ఉదయం ఆర్డివో వినరుకృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకారెడ్డితో పాటు రెవెన్యూ అధికారులు ప్రొక్లెయిన్తో భవనాలు తొలగించేందుకు ప్రయత్నించారు. దీనిని సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. తాత్కాలికంగా కూల్చివేతను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఖమ్మం టూటౌన్ కార్యదర్శి నర్రా రమేష్ మాట్లాడుతూ.. శిథాలావస్థ పేరుతో ఎన్ఎస్పి క్వార్టర్స్ కూల్చివేయాలనే నిర్ణయం సరిగాదని, ఆ స్థలాలను వెంటనే ఎన్ఎస్పి రిటైర్డ్, సర్వీసు ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి క్యాంపు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వాసిరెడ్డి వీరభద్రం, కుమారిస్వామి, బషీర్తో పాటు సిపిఎం నాయకులు వీరబాబు, వెంకన్న, కస్తూరి, బీబీ, స్థానికులు పాల్గొన్నారు.