Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
చెల్లప్ప కమిటీ నివేదిక అందాక కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, రాష్ట్రపతి ఆమోదంతో బోయలను బీసీ గ్రూపు నుంచి ఎస్టీలోకి మారుస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. బోయలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. బ్యాంకులు రుణాల మంజూరులో సహకరించనందున సబ్సిడీలు పెంచామని, లక్షకు ఎనభైశాతం, రెండు లక్షలకుపైన అరవైశాతం, ఐదులక్షల పరిమితిలో సబ్సిడీలు వర్తిస్తాయని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ వాల్మీకి విగ్రహం, బోయలకు భవనం ఏర్పాటుకు సహకరిస్తానని, వచ్చే జయంతి నాటికి వరంగల్లో తానే ఆవిష్కరిస్తానని ప్రకటించారు. ఫెడరేషన్కు నిధుల మంజూరులోనూ సహకరిస్తానని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బోయలు విశ్వాసానికి నమ్మకానికి ప్రతీకలన్నారు. భారతీయ సంస్కృతి వాల్మీకి రచించిన రామాయణంలోని పాత్రలపై ఆధారపడి ఉన్నదన్నారు. రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలంటే చదువు, ఐకమత్యం ముఖ్యమని సూచించారు. కొట్లాడి హక్కులు తెచ్చుకోవాలన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో బోయల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బోయలు ధర్మానికి ప్రతీకలన్నారు. వాల్మీకులు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో స్థానం సంపాదించేందుకు ఐకమత్యంగా ఉద్యమించాలని కోరారు. గట్టు భీముడు స్వాగతోపన్యాసం చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకుపైగా బోయజనాభా ఉన్నదని, కచ్చితమైన జనాభాగణన జరగలేదని అన్నారు.