Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీమ పోరాట సమితి అధ్యక్షులు బైరెడ్డి
నవతెలంగాణ - ముషీరాబాద్
కోర్టు తీర్పును ధిక్కరించి, అమరావతి శంకుస్థాపన జరిగిన అక్టోబర్ 22వ తేదీ రాయలసీమకు చీకటి రోజని రాయలసీమ పోరాట సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఎస్ఎంఎస్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావలసిన రాజధానిని అమరావతిలో నిర్మించడం కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసమేనని ఆరోపించారు. 500 ఎకరాల్లో నిర్మించుకోవాల్సిన రాజధానికి వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకోవటంలో చంద్రబాబు ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 13 జిల్లాల చిన్న రాష్ట్ర రాజధానిని ఒక ఖండానికే రాజధాని అన్న తీరుగా నిర్మించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలా అయితే మూడు తరాలు గడిచినా రాజధాని నిర్మాణం పూర్తికాదని ఎద్దేవా చేశారు. పంటలు పండక, నీళ్లు లేక, నిరుద్యోగ సమస్యతో రాయలసీమ ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి సమస్యలపై దృష్టి పెట్టడంలేదని విమర్శించారు. లక్షల ఎకరాల భూమి రాయలసీమలో ఉంటే సంవత్సరానికి మూడు పంటలు పండే అమరావతి ప్రాంత భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకొని పంట పొలాలను నాశనం చేశారన్నారు. అమరావతి నిర్మాణం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పర్యావరణం దెబ్బతింటుందని, కృష్ణానదీ తీర ప్రాంతం వల్ల వరదలు ఎక్కువగా వస్తాయని అన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అమరావతి నిర్మాణం ఆపాలని కోర్టును ఆశ్రయించిన సామాజిక కార్యకర్త శ్రీమన్నారాయణను అనేక విధాలుగా ప్రలోభపెట్టి కేసు ఉపసంహరించుకోవాలని కోరారని, ఆయన లొంగకపోతే భయపెట్టారని ఆరోపించారు. కోర్టు ఈ నెల 10న స్టే ఇచ్చిందని, 16న అమరావతి నిర్మాణం ఆపాలని మరో ఆర్డర్ జారీ చేసినప్పటికీ కోర్టు తీర్పును ధిక్కరించి శంకుస్థాపన చేశారన్నారు. న్యాయపోరాటం చేస్తున్న శ్రీమన్నారాయణకు ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ.. తన ప్రాణం ఉన్నంత వరకు పర్యావరణాన్ని కాపాడేందుకు, ప్రజలకు న్యాయం జరగాలని పోరాడుతూనే ఉంటానని చెప్పారు.