Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిటిడిపి అధికార ప్రతినిధి రావుల
విజయవాడ : వరంగల్ ఉప ఎన్నికలకు రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని తెలంగాణ టిడిపి అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం బుధవారం వరంగల్లో టిడిపి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. టి టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్రెడ్డి, మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు తదితరులు సిఎం చంద్రబాబును విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. వీరు వరంగల్ ఉప ఎన్నికలపై సిఎంతో సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలపై చర్చించామన్నారు. దీనిపై సిఎం సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. నెల రోజులుగా తాము నిర్వహించిన అన్ని కార్యక్రమాలు, తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆత్మహత్యలు, పత్తి రైతుల సమస్యలు తదితరాలన్నింటిపై సిఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో మిత్రపక్షాల భాగస్వామ్యంలో బిజెపికి అవకాశం ఇచ్చామన్నారు. అయితే తర్వాత స్థానికంగా అక్కడ ఉన్న రెండు పార్టీల నాయకుల మనోభావాలు ఆయన దృష్టికి తెచ్చామన్నారు. త్వరలో టిడిపి ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకాలేదన్నారు. దీనిని సానుకూలంగా తీసుకుని బిజెపి టి టిడిపిలు సమన్వయంతో ఉండి పరస్పర అవగాహనతో పని చేయాలని, సంస్థాగతంగా అంతా పని విభజన చేసుకోవాలని చంద్రబాబు సూచించారన్నారు. ప్రస్తుతం టి టిడిపికి క్యాడర్ బాగుందని, భవిష్యత్లో పూర్వ వైభవం వస్తుందని రావుల ఆశాభావం వ్యక్తం చేశారు.
నవంబరు 7న టిటిడిపి సమావేశం
వచ్చే నెల 7న హైదరాబాద్లో టి టిడిపి రాష్ట్రస్ధాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గాలను ఎన్నుకొంటామన్నారు. తర్వాత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి 29 నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. టి టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ ఐక్యంగా పని చేస్తే 2019లో తెలంగాణలో టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు. ప్రతి పార్టీలోనూ చిన్న చిన్న పొరపాట్లుండటం సాధారణమేనన్నారు.
తెలంగాణలో మూడు దఫాలుగా ప్రతిపక్షంలో ఉన్నా ధైర్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఎంపి గుండు సుధారాణి పార్టీ మార్పు, ఎర్రబెల్లి - రేవంత్ మధ్య ఏర్పడిన వివాదంపై విలేకర్లు ప్రశ్నించగా సుధారాణి పార్టీని విడిచి వెళ్తుందని తాము అనుకోవడం లేదన్నారు. అలాగే సిఎం వద్ద వ్యక్తుల పరంగా ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అసలు వారి మధ్య గొడవలే లేవన్నారు. తామంతా ఏకతాటిపై ఉన్నామని వివరించారు.