Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్
- వైద్యరంగంలో సరికొత్త ఆవిష్కరణలు రావాలి- రతన్టాటా
- స్టార్టప్ల రాజధానిగా తెలంగాణ - కెటిఆర్
- ఘనంగా టి.హబ్ ప్రారంభోత్సవం
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు గ్రామస్థాయికి విస్తరించాల్సిన అవసరం ఉందని తెలుగురాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అన్నారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్ధులు, వైస్ ఛాన్సల ర్ల తో టి.హబ్ను అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత సరికొత్త ఆవిష్కరణల్ని చేస్తూనే ఉందని, వాటికి సరైన ప్రోత్సాహం, గుర్తింపు లభించ కపోవడంతో అవి మరుగున పడిపోతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టి.హబ్ను బుధవారంనాడాయన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్టాటాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అక్కడి యువత చేస్తున్న సరికొత్త ఆవిష్కరణలు చూస్తున్నామని, అయితే వాటిని ఎక్కడికి తీసుకుపోవాలో వారికి తెలియని పరిస్థితి ఉందన్నారు. కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలకు పల్లెల్లో కొదవలేదని, గ్రామీణ పరిశోధనలకు టి.హబ్ వేదిక కావాలని అన్నారు. తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, ఆరోగ్యం, ఐటి రంగాలలో కొత్త స్టార్టప్లు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలన్నారు. కేవలం 17నెలల వ్యవధిలోనే టి.హబ్ను ప్రారంభించడం ముదావహమని, సమాజం, సామాన్యుడి అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు జరగాలని ఆకాంక్షించారు. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మాట్లాడుతూ పూర్తి స్థాయి ఇంక్యుబేటర్ సెంటర్తో టి.హబ్ భారత దేశానికి కొత్త ముఖ చిత్రం అవుతుందని ప్రశంసించారు. ఒక మంచి ఆలోచనకు తెలంగాణ రాష్ట్రం నాంది పలికిందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు దేశంలో కొదవలేదని, కొత్తవాటిని సృష్టించడంలోనే కొంత లోటు ఉందని వ్యాఖ్యానించారు. ఆ లోటును టి.హబ్ తీరుస్తుందని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వైద్యం, లైఫ్ సైన్సెస్, గ్రామీణ పరిశ్రమలు, సంప్రదాయ పరిశ్రమలు, వ్యవసాయం, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలు కొత్త పుంతలు తొక్కే విధంగా, వినూత్న ఉత్పత్తుల అభివృద్ధికి ఇలాంటి హబ్లు తోడ్పడాలని అన్నారు. కొత్త ఆవిష్కరణల సృష్టికి మిలియన్ డాలర్లు అవసరం లేదని, ఓ సరికొత్త ఆలోచలు చాలని చెప్పారు.రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ 'ఆలోచనలతో రండి...ఆవిష్కరణలతో వెళ్లండి' అనేది టి.హబ్ నినాదమని చెప్పారు. రెండో దశ టి.హబ్ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో కోట్లాది మంది యువత ఉందని, మేధో సంపత్తి కూడా మన సొంతమని చెప్పారు. దేశ, విదేశాల్లో సరికొత్త ఆవిష్కరణలతో భారతీయులు పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించడమే టి.హబ్ను ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. స్టార్టప్లకు హైదరాబాద్ రాజధాని కావాలన్నదే తమ లక్ష్యమని, దేశంలోని ఏ ప్రాంతంవారైనా స్టార్టప్లకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ట్రిపుల్ ఐటి, నల్సార్ యూనివర్సిటీ, ఐఎస్బి, నాస్కాం వంటి సంస్థల భాగస్వామ్యంతో టి హబ్ పని చేస్తుందని అన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్ వంటి సంస్థల్లో ముఖ్య స్థానాల్లో ఉన్నవారితో సంప్రదింపులు జరిపామని, వారి సేవల్ని కోరామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్శర్మ, నాస్కాం చైర్మన్ బివిఆర్ మోహన్రెడ్డి, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అపజయాలు... విజయానికి సోపానాలు
సమాజోన్నతికోసం భిన్నంగా ఆలోచించండి
మీట్ ది ప్రెస్లో రతన్టాటా
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
అపజయాలతో యువత కృంగిపోవాల్సిన అవసరం లేదని, వాటిని భవిష్యత్ విజయానికి సోపానాలుగా మరల్చుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్టాటా అన్నారు. ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో గురువారం టి హబ్ ప్రారంభోత్సవం అనంతరం స్టార్టప్ల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో రతన్టాటా వేర్వేరుగా మాట్లాడారు. హాస్యోక్తులు, ఛలోక్తులతో ఆయన అందరినీ నవ్వించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అభద్రతాభావ పరిస్థితుల గూర్చి అడగ్గా... భారతదేశం అనాదిగా మతసామరస్యానికి ప్రతీకగా ఉందని, భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగాలని అన్నారు. భిన్న మతాలు, సంస్కృతులు, విశ్వాసాలకు భారతదేశం నిలయమని, ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్నారని, ఈ వాతావరణం ఇలాగే కొనసాగాలని చెప్పారు. మీరు గౌరవించే మతం అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా ఇంత మందిలో చిక్కుప్రశ్న వేస్తే ఎలాగని ప్రశ్నించి నవ్వించారు. టాటాకు చెందిన కొన్ని వాహనాలు కూడా విఫలమైన విషయం గూర్చి ప్రశ్నించగా... అంతమాత్రాన నిరుత్సాపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్ విజయాలకు అవి బాటలుగా మారతాయని చెప్పారు. ఇజ్రాయల్ వంటి దేశం కొత్త ఆవిష్కరణల్లో ముందుందని.. మీ అభిప్రాయం చెప్పాలని ఒక పారిశ్రామిక వేత్త అడగ్గా... 'అవును' అంటూనే... చాలా విషయాల్లో ఆ దేశానికి చెందిన సైంటిస్టులు ముందున్నారని చెప్పారు. పారిశ్రామిక వేత్తగా విజయం సాధించడానికి దోహదపడిన అంశాలేవని అడగ్గా... కృషి. పట్టుదల, అంకితభావం అని జవాబిచ్చారు. సంప్రదాయ వ్యాపారాల రూపం మారుతోందని, దీనికి భిన్న ఆలోచనల్లోంచి ఉద్భవిస్తున్న ఆవిష్కరణలే కారణమని మరో ప్రశ్నకు విశ్లేషణ ఇచ్చారు. కుటుంబ రవాణాకు అవసరమైన వాహన ఆవిష్కరణలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైద్యరంగంలో విశేషమైన నూతన ఆవిష్కరణలకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, యువత ఆవైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు తదితరులు పాల్గొన్నారు.