Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల నుండి ఆదరణ కరువు
- మూడు రోజుల్లో 32 క్వింటాలే అమ్మకం
- ముస్లిం ప్రాంతాల్లో నామమాత్రపు విక్రయాలు
- ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో కేంద్రాలు
నవతెలంగాణ - సిటీ బ్యూరో
బహిరంగ మార్కెట్లో అధిక ధర ఉన్న కందిపప్పును కేవలం రూ.135కే అందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన సబ్సిడీ కేంద్రాలకు ప్రజల ఆదరణ కరువైంది. రెండో రకం పప్పును విక్రయిస్తుండటం, అందులో తేమ ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. హైదరాబాద్ నగరంలో నాలుగు రోజులు కిందట పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 10 కందిపప్పు కేంద్రాలను ప్రారంభించగా, మూడు రోజులుగా 32 క్వింటాళ్లే అమ్ముడుపోయింది. మరో 5 రూపాయలు ఎక్కువ పెడితే మెరుగైన పప్పు లభిస్తుండటంతో ప్రజలు ఇటువైపు రావడం లేదు. అంతేకాకుండా, 7 కేంద్రాలను అధికారులు ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించారు. సరిగా నిర్వహించకపోవడం వల్ల వినియోగదారులకు ఉపయోగ పడటం లేదు. ఎర్రగడ్డ, ఫలక్నుమా రైతు బజార్లలో మాత్రమే ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి.
సబ్సిడీ కేంద్రాల ద్వారా కుటుంబానికి కిలో చొప్పున రూ.135కే కందిపప్పు అందిస్తున్నారు. నగరంలో గత నెల 31న ఎర్రగడ్డ, ఫలక్నుమా రైతుబజార్లు, సెక్రటేరియట్, సైదాబాద్, చంద్రాయణగుట్ట, మలక్పేట, అంబర్పేట, న్యూబోయిగూడ, అడ్డగుట్ట, ఇస్లామియాబజార్లో కందిపప్పు కేంద్రాలను ప్రారంభించారు. రైతుబజార్లు మినహా మిగతా కేంద్రాల్లో పప్పు విక్రయాలు నామమాత్రంగా సాగుతున్నాయి. మొదటి రోజున ఇస్లామియాబజార్లో 4కిలోలు, చంద్రాయణగుట్టలో 5, మంగళ్హాట్, అంబర్ పేటలో 10 కిలోల చొప్పున, సైదాబాద్లో 15 కిలోలు, ఎర్రగడ్డ రైతుబజార్లో 150, ఫలక్నుమా రైతుబజార్లో 185కిలోల పప్పు విక్రయించారు. ఆతర్వాత ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
నాసిరకం పప్పు: సబ్సిడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పప్పులో నాణ్యత లేదని వినియోగదారులు అంటున్నారు. రెండో రకం పప్పుతోపాటు తేమ ఎక్కువగా ఉండడంతో పప్పు అరగంటైనా ఉడకడం లేదని మహిళలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కొన్ని కేంద్రాల్లో తూకం కూడా సరిగా రావటంలేదని కిలోకు 20గ్రాములు తక్కువగా వస్తున్నట్టు చెబుతున్నారు. బయటి మార్కెట్లో ఇంత కంటే కొంచెం మెరుగైన పప్పు హోల్ సేల్లో కిలో రూ.140 నుంచి 145కు దొరుకుతుందని పలువురు చెప్పారు.
అధికారుల నిర్లక్ష్యం: సబ్సిడీ కేంద్రాలను ప్రజలకు అనువైన ప్రదేశంలో ఏర్పాటు చేయకపోవడంతోపాటు, వాటిపై ప్రచారం కల్పించడంలోనూ అధికారులు విఫల మయ్యారు. నగరంలో ఏడు కేంద్రాలను బియ్యం, కిరాణ సామాను అమ్మేవారికి అప్పగించారు. ఈ కేంద్రాల ఏర్పా టుపై సరైన ప్రచారం లేక వీటికి కొద్ది దూరంలో ఉండేవారికి కూడా ఈ విషయం తెలియడం లేదు. న్యూబోయగూడలోని కాలనీకి చివరగా బియ్యం దుకాణంలో పప్పు కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. దుకాణం ముందు సబ్సిడీ కంది పప్పును అమ్ముతున్నట్టు తెలిపే విధంగా ఎలాంటి బోర్డు పెట్టలేదు.
నామమాత్రంగా అమ్మకాలు : అక్టోబర్ 31న పది కేంద్రా ల్లో 10.04 క్వింటాళ్ళు, ఈనెల 1న 9.42 క్వింటాళ్ళు, 2న 7.02 క్వింటాళ్ల పప్పు విక్రయాలు జరిగాయి. ఇందులో మూ డు రోజుల్లో ఎర్రగడ్డ రైతు బజార్లో 8.74క్వింటాళ్ళు, ఫలక్ నుమా రైతుబజార్లో 6.20 క్వింటాళ్ళు, సెక్రటేరియట్లో 2.70 క్వింటాళ్ల పప్పు అమ్మగా మిగతా చోట్ల తక్కువ మోతాదులో విక్రయాలు జరిగాయి.
నాణ్యత లేదు: రాసాల అమృత
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పప్పులో నాణ్యత లేదు. అరగంటైనా ఉడకడం లేదు. మార్కెట్లో లభించే పప్పుతో పోల్చుకుంటే ఈ పప్పు అంత రుచిగా ఉండట్లేదు. నాణ్యత గల పప్పును సరఫరా చేయాలి.
తేమ ఎక్కువగా ఉంది: శేషయ్య
సబ్సిడీపై పంపిణీ చేస్తున్న పప్పులో తేమ ఎక్కువగా ఉంది. బయటి మార్కెట్లో ఇంతకంటే మంచి పప్పు మరో ఐదు, పది రూపాయలు ఎక్కువగా పెడితే దొరుకుతుంది.
నాణ్యమైన పప్పునే పంపిణీ చేస్తున్నాం
సబ్సిడీ కేంద్రాల్లో నాణ్యత గల పప్పునే సరఫరా చేస్తున్నాం. ఏ కేంద్రంలో కుడా పప్పు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పప్పు విక్రయాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.
- ఏఎస్ఓ సత్యనారాయణ