Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ రవాణా విభాగంలో చేతివాటం
దోపిడీ దొంగల కన్నా హీనం
- అయినా చర్యలు పూజ్యం
- 'టు బీ డిస్కస్డ్'కే పరిమితమా?
- కొరడా ఝళిపిస్తారా..?
- శంభాజీ. ఎల్
గత ఏడాది కాలంలో (2014)లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దొంగతనాల మొత్తం విలువ 155 కోట్ల 35 లక్షల రూపాయలు. ఇది కేంద్ర హోం శాఖ ఇటీవల విడుదల చేసిన 'ఎన్సీఆర్బీ' నివేదిక సారాంశం. నేరాలు- ఘోరాల విషయంలో దానివే అసలుసిసలు గణాంకాలుగా ప్రతి రాష్ట్రం.. అధికారులు.. పౌరులు.. పరిగణించడం కద్దు. అలాంటిది..! రాష్ట్ర ప్రభుత్వంలో అనేకానేక శాఖలు ఉంటాయని అందరికీ తెలుసు. అందులో మునిసిపల్ వ్యవహారాల శాఖ ఒకటి. దాని చేతులు చాలా పొడవైనవి. ఆ చేతుల్లో ఒక చిట్టి వేలుకు సమానమైనదిగా రాజధాని నగరాన్ని పరిపాలించే సంస్థను పోల్చుకోవచ్చు. అదే ''గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్'' (జీహెచ్ఎంసీ). మరి అది చేసిన నిర్వాకం ఏమిటో తెలుసా..?
దారి దొంగల కన్నా హీనం
జీహెచ్ఎంసీలో తిరిగి అనేకానేక శాఖలు ఉంటాయి. అందులో ఒకటి రవాణా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కేవలం ఆ ఒక్క శాఖలోనే 100 కోట్ల కుంభకోణం చోటు చేసుకుంటుందంటే..? నమ్మక తప్పని పచ్చి నిజం ఇది! ఇది ఏ విపక్షపు ఆరోపణలో కాదు; అప్పట్లోనే రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తేల్చిన నిప్పులాంటి నిజమిది!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజూ 3,500 టన్నుల చెత్త సమకూరుతుందన్నది ఒక అంచనా! దానిని శివారు ప్రాంతాలకు తరలించేందుకు పెద్ద ట్రక్కులు, టిప్పర్లు, లారీలు, చిన్న చిన్న వాహనాలను ఉపయోగిస్తారు. అందు కోసం దాదాపు 700 వాహనాలను వినియోగిస్తారు. అలా వినియోగించే వాహనాల్లో భారీ వాహనాలు ఒక లీటర్ ఇంధనంతో కనీసం 10కిలోమీటర్లు తిరగుతాయి. అది సాంకేతిక వాస్తవం. దానిని ఎవరూ కాదనలేరు.
అపరిమిత ఇం'ధనం'
అదేమి చిత్రమో కానీ; జీహెచ్ఎంసీ భారీ వాహనాల మైలేజీ అక్షరాల 'మూడు కిలో మీటర్లు' మాత్రమే! నిన్న మొన్న కొన్న 'బ్రాండ్ న్యూ' వాహనం సైతం తొలి రెండు మూడు నెలల కాలంలో అయిదు కిలోమీటర్ల కన్నా అధిక మైలేజీ ఇవ్వదు. అదీ జీహెచ్ఎంసీ మాయాజాలం. ఇక చెత్త వాహనాలకు తోడు వేర్వేరు అధికారులు స్థాయిలనుబట్టి సంచరించేందుకు పాత జీపుల నుంచి కార్లు.. అత్యాధునిక కార్ల దాకా మరో 200 వాహనాలను జీహెచ్ఎంసీ తిప్పుతోంది. అవి నెల నెలా 'వేలాది కిలోమీటర్లు' బాజాప్తుగా తిరుగాడుతాయి. వాటి ఇం'ధనం'పై పరిమితులు లేవు. ప్రతి వాహనం బల్దియా వాహన మరమ్మత్తుల కేంద్రం నుంచే ఇంధనాన్ని 'నింపుకొంటాయి'. ఈ తతంగం కొత్తగా జరుగుతున్నదేమీకాదు; ఏండ్లకేండ్లుగా కొనసాగుతోన్న బాగోతం! అయినా ఎందుకు వెలుగు చూడదంటే..ఎవరి వాటా వారికి వారి ''స్థాయి''ని అనుసరించి బహు జాగ్రత్తగా ముడుతుంది మరి!!
'వంతులు' బరాబరీ
బల్దియా అధీనంలోని వాహనాలను మరమ్మత్తు చేసేందుకు మహానగరంలో ఖైరాతాబాద్, మలక్పేట్, కవాడీగూడలో గ్యారేజీలున్నాయి. ఏ వాహనం ఏ గ్యా రేజీలోకి మరమ్మత్తుకు వచ్చినా.. మెకానిక్, ఫోర్మెన్, అసిస్టెంట్ ఇంజినీర్, డివిజనల్ ఇంజినీర్ నుంచి 'చీఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్' (సీటీఓ) దాకా ఎవరి 'వంతులు' వారికి ఎలాంటి 'పేచీ' లేకుండా 'ఏక్తా రాగ్'లో చేరిపోతాయి. నిజానికి బల్దియా పరిధిలో ఉన్న ప్రతి వాహనంపై పెత్తనం సీటీవోదే! ఏకంగా ఆ స్థాయి అధికారులపైనే వరుసబెట్టి ఆరోపణలు రావడం.. నిజాలు నిగ్గు తేలడం.. ఉన్నతాధికారులు వాటిని తొక్కిపెట్టడం.. ఆ లోపు 'పుణ్యకాలం' కాస్తా గడిచి వారికి ప్రమోషన్లు రావడమో లేదా పదవీ విరమణ చేయడమో జరిగిపోతూ వస్తోంది.
సెకండ్ హాండ్ విడిభాగాలు
ఘోరాతిఘోరమైన విషయం ఏమిటంటే.. ఏదేనీ వాహనంలో ఒక ముఖ్య భాగం పాడైతే 'బ్రాండ్' పరికరం అమర్చాలి. రికార్డుల్లో అలా బ్రాండ్ పరికరాలను 'అమర్చుతారు'.. కానీ, నిజానికి చేసే పని ఏమిటంటే.. అఫ్జల్గంజ్ సెకండ్స్ మార్కెట్లో విడిభాగాలు కారు చౌకగా కొని వాహనాలకు అమర్చడం! ఇంతకన్నా జుగుప్సాకరం ఇంకేదైనా ఉందా? అంతేనా..? అలాంటి డొక్కు పరికరాలను అమర్చిన వాహనాలతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో రాజధాని వాసులకు సుపరిచితమే! (పౌర హక్కుల సంఘంలో ఒకనాడు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రజా సంఘ నేత ఆకుల భూమయ్య ప్రాణాలను హరించింది సాక్షాత్తూ బల్దియా చెత్తవాహనమే కావడం గమనార్హం!) అలా చెత్త విడిభాగాలను అమర్చి బ్రాండెడ్ బిల్లులే సమర్పిస్తారు. అందుకు ఎన్.వి ఎంటర్ప్రైజెస్..గౌతం ఏజెన్సీస్, దిలీప్టైర్స్, గోపీనాథ్ ఆటో మొబైల్స్, కృష్ణ ఆటో సర్వీసెస్, గాయత్రి ఇంజినీర్స్ లాంటి వాటిలో కొన్ని 'కాగితపు' సంస్థలను బల్దియా అధికారులే సృష్టించుకుంటారు.
ఆయా రసీదుల్లో ముద్రించిన చిరునామాలకు వెళ్లేందుకు యత్నిస్తే.. వాటి ఉనికి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ వారికి 'లెన్స్' వేసి వెతికినా కానరాలేదు. ఎన్.వి ఎంటర్ప్రైజెస్, గాయత్రీ ఏజెన్సీస్ బిల్లుల్లో పేర్కొన్న చిరునామాల్లో లేనేలేవు. అంతటి ఘనులు మరి మన బల్దియా అధికారులు!
ఇదీ తీరు..!
- 2007- 08లో రవాణ విభాగం లెక్కలు 60 కోట్లు
- 2008-09లో కేవలం మరమ్మత్తులకే 40 కోట్లు
- అదే సంవత్సరం ఇం'ధనం' విలువ 41 కోట్లు
- బాధ్యులపై చర్యలు దాదాపు శూన్యం
- నోరెత్తని బడా బాబులు
బయట పడిన దొంగలు 23 మంది. (వారిలో కొందరు రిటైర్ అయ్యారు. మరి కొందరులు ఏపీ క్యాడర్కు వెళ్లిపోయారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ సేవల్లోకి వెళ్లారు.)
విజిలెన్స్ సిఫారసులు
రవాణ విభాగంలో అవినీతిని అరికట్టేందుకు విజిలెన్స్ కమిషన్ అయిదు సిఫారసులు చేసింది. 1). వాహనాల విడిభాగాలను నిపుణులైన వెహికిల్ ఇన్స్పెక్టర్లతో తనిఖీ చేయించాలి. వాటి అమరిక కోసం ఆటో మొబైల్ ఇంజినీర్ సిఫారసు తప్పనిసరి. తద్వారా బోగస్ చెల్లింపులను నివారించవచ్చు. 2). ఏ అధికారి పర్యవేక్షణలో మరమ్మత్తులు జరిగాయో వాటి వివరాలను పొందుపరిచే బాధ్యతను అతనికే అప్పగించాలి. 3). చివరి చెల్లింపులు జరిగేదాకా రికార్డుల్లో ప్రతి వివవరం నమోదు కావాలి. 4). ముఖ్యమైన పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాకుండా శాశ్వత ఉద్యోగులకే అప్పగించాలి. 5). వాహనాల విడిభాగాల అమరిక, మరమ్మత్తుల విషయంలో కమిషన్ ఎప్పటికప్పుడు విధివిధానాలను జారీ చేసి వ్యవస్థ బాగు కోసం ఆజ్ఞలు జారీ చేయాలి.
పెద్దగా తెలియదు: సీటీఓ
నివేదికలో పొందు పరిచిన అంశాల ఆధారంగా ఏమైనా చర్యలు తీసుకున్నారోనని 'నవ తెలంగాణ' తెలుసుకొనేందుకు యత్నించింది. చీఫ్ ట్రాన్స్పోర్టు అధికారి(సీటీవో) అనిల్ రాజ్ను సంప్రదించగా తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించానని.. చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని.. అయినా మరోసారి కనుక్కొని చెప్తానని తెలిపారు.
కొత్త 'బాస్' దృష్టి సారిస్తారా..?
సాధారణ పరిపాలనలో భాగంగా.. ఇంకా ప్రభుత్వాలు మారినప్పుడల్లా బల్దియాకు 'బాస్' (కమిషనర్) మారడం సాధారణం. సోమేశ్ కుమార్ మొన్నటిదాకా బాస్గా కొనసాగారు. ఆయన హయాంలో విజిలెన్స్్ నివేదికపై చర్యలుంటాయని చాలా మంది ఆశించారు.
కమిషనర్గా ఏ కొత్త అధికారి వచ్చినా అర్ద దశాబ్దకాలంగా విజిలెన్స్ నివేదిక ఆయన టేబుల్పైకి వెళ్లడం రివాజుగా మారింది. అంతే రివాజుగా ప్రతి కమిషనర్ ''టు బీ డిస్కస్డ్'' అని రాస్తున్నారు. ఏం చర్చించారో.. దానిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పే నాథుడే కరువయ్యారు. ఈ నేపథ్యంలో సౌమ్యునిగా.. అందరితో కలివిడిగా వ్యవహరిస్తారని పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి తాజాగా బల్దియా 'బాస్'గా నియుక్తులయ్యారు. ఆయన హయంలోనైనా ఈ నివేదికపై చర్యలుండాలని నిజాయితీపరులు ఆశిస్తున్నారు. 'ఆ.. ఎవరుపోయి ఎవరొస్తేనేం..? అంతా టు బీ డిస్కస్డ్యే..' అని పెదవి విరుస్తున్న వారూ లేకపోలేదు.