Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యంత్రాంగం
ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండలో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థి, ఖమ్మంలో వైసీపీ, ఆదిలాబాద్లో టీడీపీ, స్వతంత్ర; కరీంగనర్లో టీఆర్ఎస్ నుంచి ఇద్దరు, స్వతంత్ర ఒకరు, రంగారెడ్డిలో స్వతంత్ర, మహబూబ్నగర్లో టీడీపీ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఎంపీ గుత్తాసుఖేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా తిరుమలగిరికి చెందిన మిట్ట పురుషోత్తంరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మంలో వైసీపీ అభ్యర్థి లింగాల కమల్రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎంఎల్సీ అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరెడ్డి, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఫోరం తరఫున స్వతంత్ర అభ్యర్థిగా జన్నారం మండలం కవ్వాల్ ఎంపీటీసీ రియాజుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు.
కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ... భానుప్రసాద్రావు, నారదాసు లక్ష్మణ్రావులను అభ్యర్థులుగా ప్రకటించింది. భానుప్రసాద్రావు తరఫున ప్రీతి రఘువీర్సింగ్ ఠాగూర్ 7న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. మంగళవారం నారదాసు లక్ష్మణ్రావు తరఫున ఇల్లంతకుంట జడ్పీటీసీ సిద్ధం వేణు, కరీంనగర్ మేయర్ రవీందర్సింగ్ చేరో సెట్టు నామినేషన్ వేశారు. టి.భానుప్రసాద్రావు తరఫున టీఆర్ఎస్ జిల్లా నాయకులు రెండోసారి టి.ప్రభాకర్రావు నామినేషన్ వేశాడు. ఇక స్వతంత్య్ర అభ్యర్థిగా ఎం.తిరుపతిరావు సైతం తన నామినేషన్ను జిల్లా రెవెన్యూ అధికారి బ్రహ్మయ్యకు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీల ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కొత్త అశోక్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఒక స్థానానికి అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మహ బూబ్నగర్ జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా కొత్తకోట దయాకర్రెడ్డి ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్కు నామినేషన్ సెట్టును అందజేశారు. ఆయన వెంట కొడంగల్ ఎమ్మెల్యే, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఉన్నారు.
ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
టీఆర్ఎస్ జాబితా విడుదల
- వరంగల్ కొండా మురళీ, మహబూబ్నగర్లో జగదీశ్రెడ్డితో పాటు కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార టీఆర్ఎస్పార్టీ ప్రకటించింది. మొత్తం పన్నెండు స్థానాలకు గాను ఈ నెల ఆరున ఏడుగురు అభ్యర్థుల జాబితాను వెల్లడించిన టీఆర్ఎస్పార్టీ, మంగళవారం మరో ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మంగళవారం సాయంత్రం తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో టిఆర్ఎస్పార్టీ నేత డి.శ్రీనివాస్, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు వెల్లడించారు. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొండా మురళి పేరును ఖరారు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో సుంకిరెడ్డి జగదీశ్రెడ్డితో పాటు కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శంభీపూర్ రాజు, పట్నం నరేందర్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా డి శ్రీనివాస్ మాట్లాడుతూ 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేకే మాట్లాడుతూ పార్టీ విజయావకాశాలను బేరీజు వేసుకునే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశామన్నారు. తమ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతమవుతుందని స్పష్టం చేశారు.