Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్, హౌరా, చెన్నై వెళ్లే రైళ్లకు లాలాగూడలో ఎలక్ట్రిక్ లోకో షెడ్
- సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అశీష్ అగర్వాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే ఆదాయ మార్గంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రయాణికుల రవాణా ద్వారా రు.844 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆశీష్ అగర్వాల్ చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్లోని లాలాగూడ ఎలక్ట్రిక్ లోకో షెడ్ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది 63,67 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రు.4,348 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది నవంబర్ నాటికే రు.43,6 టన్నుల సరుకు రవాణా చేసినట్టు ఆయన వివరించారు. నవంబర్ నాటికే నిర్ధేశించిన 41,6 టన్నుల కంటే ఇది ఎక్కువేనని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా ఐదు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 14 ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. లాలాగూడలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్ ద్వారా సికింద్రాబాద్-హౌరా, చెన్నై వరకు నడిచే 72 లోకోమోటివ్స్ ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు నడపడం కోసం ఏర్పాటు చేశామన్నారు. ఈ షెడ్డును ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేశామని ఆశీష్ అగర్వాల్ చెప్పారు. 1995లో డబ్ల్యూఏఎమ్ 4, డబ్ల్యూఏజీల సామర్థ్యం గల లోకోమోటివ్స్ను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. 2007లో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన త్రీఫేజ్లోకోస్ను అదనంగా చేర్చామన్నారు. ప్రస్తుతం ఈ షెడ్ ద్వారా 40 డబ్ల్యూఏపీ- 4, డబ్ల్యూఏపీ 7, 112 డబ్ల్యూఏజీ- 9లతో మొత్తం రెండు వందల లోకోమోటివ్స్ ద్వారా ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు నడిపిస్తున్నామని చెప్పారు. దీంతో పాటు రాజధాని, ధూరంతో, సంపర్క్క్రాంతి వంటి ఎక్స్ప్రెస్ రైళ్లను లాలాగూడ షెడ్ ద్వారా నడుస్తున్నాయని తెలిపారు. స్టాక్ను నిల్వచేయటం, సరుకును తెచ్చుకోవటం, వివిధ సెక్షన్లకు అందజేయటం వంటి బాధ్యతలను లాలాగూడ ఎలక్ట్రిక్ లోకో షెడ్ నిర్వహిస్తోందన్నారు. మెషీన్షాప్, ట్రాక్షన్ మోటార్, బోగీ, ఆక్జిలరీ మెషిన్లు, ఎలక్ట్రానిక్, జనరల్, ఎస్పీఎమ్, రిలే, న్యూమేటిక్, టెక్నికల్, టూల్రూమ్, స్టోర్ సెక్షన్ల నిర్వహణను ఈ షెడ్ నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా చెప్పాలంటే రైలు రథచక్రాలను పట్టాల మీద సజావుగా నడిపించటానికి అవసరమైన సమష్టి కృషి యంత్రమని చెప్పారు. ఈ షెడ్డులో 587 మంది పనిచేస్తున్నారని వివరించారు. అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్, ఫోర్మెన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు, క్యామటెక్-గ్యాలియర్, సీఇటీఐ-తాకుర్లి, ఎస్టీసీ-సికింద్రాబాద్, ఇటీటీసి -బెజవాడ తదితర లోకోషెడ్ శిక్షణను ఏర్పాట్లు చేస్తూ, తద్వారా మానవ వనరుల సామార్థ్యాన్ని పూర్తి స్థాయికి పెంపొందిస్తూ వారి వారి పనులకు సంబంధించినంత వరకు వివిధ సాంకేతికాభివృద్ధిలో అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తోందన్నారు. భారతీయ రైల్వే చరిత్రలో మొదటిసారిగా సీఎల్డబ్ల్యూ అభివృద్ధి చేసిన ప్రణాళిక ప్రకారం 01 డబ్ల్యూఏజీ 9లోకో 31123ని డబ్ల్యూఏజీ-9హెచ్లోకి మార్పుచేశామన్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పీఆర్వో ఉమాశంకర్కుమార్, అసిస్టెంట్ పీఆర్వో మహ్మద్ షకీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు.