Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచోడికే మేయర్
- సెటిలర్కు డిప్యూటీ
- 11న ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక
- 12న బహిరంగసభ
- చంద్రబాబు, కేంద్రమంత్రుల హాజరు
- బీజేపీ, టీడీపీ చర్చలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ, టీటీడీపీ శనివారం సీట్ల సర్దుబాటు కసరత్తు చేపట్టా యి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తాజ్కృ ష్ణా హోటల్లో ఇరు పార్టీలకు చెందిన ముఖ్యులు సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా పార్టీల నుంచి అందిన వివరాలు ఇలా ఉన్నాయి.
బలమైన డివిజన్ల ఎంపికపై
గ్రేటర్లోని 150 డివిజన్లలో ఎవరెన్ని డివిజన్లలో పోటీ చేయాలన్న విషయమై జరిగినట్టు సమాచారం. నగర శివారులోని డివిజన్లలో తెలుగుదేశం పార్టీకి బాగా పట్టుందని, ఎటూ చూసినా గ్రేటర్లో బీజేపీ కంటే తమ బలమే ఎక్కువని టీడీపీ నాయకులు సమావేశంలో అభిప్రాయపడ్డారని తెలిసింది. అయితే ఏ పార్టీకి ఏ డివిజన్లో బలముందో తేలిన తరువాతే నిర్ణయం తీసుకుందామని బీజేపీ నేతలు చెప్పడంతో మధ్యే మార్గంగా, రెండు పార్టీలు తాము ఆశిస్తున్న డివిజన్ల వివరాలతో కూడిన జాబితాను ఆదివారంలోగా పరస్పరం అందజేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి.. జాబితాలు పరిశీలించిన అనంతరం రెండు పార్టీలు ఆశించే డివిజన్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావించినట్టు ఆ పార్టీల నాయకులు చెప్పారు. డివిజన్లలో ఎన్నికల ప్రచారం బాధ్యత రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకే అప్పగించాలనే అంగీకారానికి సైతం వచ్చారు. ఒక్కో డివిజన్ను ఒక్కో నేతకు అప్పగించాలని, ఇందుకోసం రెండు పార్టీలు తమ తమ నేతలను గుర్తించాలని నిర్ణయించారు.
మేయర్..డిప్యూటీ మేయర్
మేయర్ అభ్యర్థిపై కొద్దిసేపే చర్చ జరిగినట్టు సమాచారం. ఇది ఎన్నికల ఫలితాల తరువాత తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి, ఇప్పుడే మేయర్ అభ్యర్థి ఎంపిక చర్చ అనవసరమని, అలా చేస్తే ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయానికి రెండు పార్టీల నేతలు వచ్చారు. అయితే సరైన అభ్యర్థికే మేయర్గా అవకాశం ఇవ్వాలని, దీనిపై నామినేషన్ల దాఖలు సమయంలో చర్చ జరపాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే, ఆ పార్టీకే మేయర్ పదవి ఇవ్వాలన్న మరో అభిప్రాయమూ వ్యక్తమైనట్టు సమాచారం. పార్టీకి విధేయుడిగా ఉన్న వ్యక్తినే మేయర్ అభ్యర్థిగా ఎంచుకోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరం సహా శివారు ప్రాంతాల్లో కూడా సెటిలర్ల ఓట్లే కీలకం. దీంతో ఈ అంశంపై రెండు పార్టీల నేతలు చర్చించారు. సెటిలర్ల ఓట్లు కీలకమైన నేపథ్యంలో, డిప్యూటీ మేయర్ పదవిని సెటిలర్కే ఇవ్వాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.
11న ప్రణాళిక, 12న సభ
సోమవారం నాటికి డివిజన్ల పంపకాలను పూర్తి చేసుకోవాలని భావించిన రెండు పార్టీల నేతలు, అదే రోజు ఉమ్మడిగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ప్రణాళికలో ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు ప్రారంభించారు. కాగా అన్ని పార్టీల కంటే ముందుగానే, ఎన్నికల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి బహిరంగ సభను 12న నిజాం కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు.
ఈ సభకు తెలుగుదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ నుంచి కేంద్రమంత్రులు పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. శనివారం జరిగిన చర్చల్లో బీజేపీ నుంచి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జీ.కిషన్రెడ్డి, బీజేఎల్పీ నేత డాక్టర్ కే. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన.్ రాంచందర్రావు, నగర శాఖ నేతలు, టీడీపీ తరపున కేంద్రమంత్రి సుజనాచౌదరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, టీ.ప్రకాశ్గౌడ్ పాల్గొన్నారు.
సీట్ల పంపకంపై చర్చ
సీట్లపై టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు చోటుచేసు కున్నాయని సమాచారం. పాతబస్తీతోపాటు హైదరాబాద్ సెంట్రల్లో 40 సీట్లు ఇస్తామని, నగర శివారుల్లో ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని టీడీపీ నేతలు, బీజేపీకి స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే పొత్తు నేపథ్యంలో కచ్చితంగా గెలిచే సీట్లు శివారుల్లోనే ఉన్నాయని, అక్కడ తమకూ సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీ పట్టుబట్టినట్టు సమాచారం. అయితే దీనిపై చర్చలు కొలిక్కిరాలేదు. ఇరుపార్టీ పార్టీల అధినేతల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన తరువాతే, తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.