Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-సంగారెడ్డి
ఎల్లంపల్లి నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల ప్రజలకు ఏప్రిల్ 30లోగా గోదావరి నీటిని అదించేందుకు చర్యలు ముమ్మరం చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మంజీరపై ఉన్న సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయినందున, వచ్చే ఐదారు నెలల పాటు నీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కంగ్టి చౌరస్తా వరకు నీరు వచ్చిందని, వచ్చే మంగళ, బుధవారం వరకు నాలుగు వందల మీటర్ల పైపులైన్ పూర్తి చేసి కంగ్టి మండలానికి నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్, సంగారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్రెడ్డి, ఏజేసీ వెంకటేశ్వర్లు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.