Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్మొల్లా ఆరోపించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బహుళజాతి సంస్థలకు ఉపయోగపడే విధానాలనే అవలంభి స్తోందన్నారు. ఇతర దేశాల్లో వ్యవసాయ రంగానికి అనేక అవకాశాలు, రాయితీలు కల్పిస్తుండగా మన దేశంలో ఉన్న సబ్సిడీలను ఎత్తివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు ఇదే విధంగా కొనసాగితే రైతులు ఏ విధంగా బతకగలుగుతారని ప్రశ్నించారు. రైతు పండించిన పంటకు స్థిర ఆదాయం వచ్చే విధంగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి రైతు ఆత్మహత్యలు అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి. జంగారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, అరిబండి ప్రసాద్రావు, టీ సాగర్, సహాయ కార్యదర్శి వాసుదేవరెడ్డి, నాగేశ్వరరావు, శ్రీశైలం, వెంకట్రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.