Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాస్పదంగా ఎస్ఐ సూసైడ్నోట్
- 'నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు' నోట్ సారాంశం
నవతెలంగాణ-కరీంనగర్ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్ఐ జగన్మోహన్ ఆత్మహత్య ఓ మిస్టరీగానే మిగిలింది. ఆయన సూసైడ్నోట్ అంటూ పెద్దపల్లి డీఎస్పీ మల్లారెడ్డి పత్రికలకు విడుదల చేసిన ప్రతులు గందరగోళంగా ఉన్నాయి. సూసైడ్ నోట్ పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న రోజు బయటకు రాని సూసైడ్ నోటు తెల్లవారి ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఏకంగా ఎస్ఐ ఆత్మహత్యపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పెద్దపల్లి డీఎస్పీ ఒక్కమాట కూడా మాట్లాడకుండా సూసైడ్ నోటు జిరాక్స్ప్రతులను విలేకరులకు అందించడం కూడా మరో అనుమానానికి కారణమవుతోంది. దాన్ని పరిశీలిస్తే నోటు డైరీలోని 8వపేజీలో ప్రారంభమై ఏడో పేజీలో ముగిసింది. అందులో ఆయన పేరు, హోదా, జిల్లా రాసి ఉన్నప్పటికీ పైన సంతకం లేదు. వాస్తవానికి సంతకం చేసి వదిలేయడం మినహా అడ్రస్కు సంబంధించినట్టుగా వివరాలు రాయాల్సిన అవసరం లేదు. సొంత డైరీలో ఈతరహా పరిస్థితి కనిపించదు. అందులోనూ సాధారణంగా ఆయన మృతితో తీరని నష్టం వాటిల్లుతున్న భార్య, కుటుంబసభ్యులను ఉద్దేశించి ఉండాల్సిన నోటు ఏకంగా ముఖ్యమంత్రిని సంభోదిస్తూ ఉంది. ముందుగా ఏసీబీకి చిక్కిన తన సోదరునికి తిరిగి ఉద్యోగం కల్పించాలని కోరారు. అంతా చల్లగా ఉండాలని, అంతా మంచివారేనని పేర్కొన్నారు. కొంత రాసిన అనంతరం పేరు హోదా రాసుకుని ముగించినట్టుగా ఉంది. అయినప్పటికీ ఆ తరువాత కూడా మరింత కొనసాగింది. ఆయన పెద్దపల్లిలో కేవలం 8మాసాలు పని చేయగానే బదిలీ చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆత్మహత్య నేపథ్యంలో తెల్లవారి విడుదల చేసిన సూసైడ్ నోట్లో ఎమ్మెల్యే మంచి వారు... ఎమ్మెల్సీ మంచివారు... అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏ మేరకు ఉంటుందని స్థానికంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతిచెందిన రోజు ఆత్మహత్యకు కారణం రాజకీయాలేనని ఆరోపించిన కుటుంబసభ్యులు తెల్లవారి పెదవి విప్పలేదు. వాస్తవానికి ఆయన ఎక్కడ పని చేసినా మంచి పేరే సంపాదించారు. ముఖ్యంగా ధర్మపురిలో పని చేసిన సమయంలో మరో గబ్బర్సింగ్గా ప్రజల నోళ్లలో నానారు. ఎంతో ధైర్యంగా పని చేస్తే మినహా ఆపేరు రాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి ధైర్యవంతుడు ఏ కారణాలు లేకుండా ఆత్మహత్య చేసుకుంటారా..?అనే ప్రశ్న జనంలో నానుతోంది. ఆత్మహత్య చేసుకున్నారంటే రాజకీయాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో బేరీజు వేసుకోవచ్చు. రాజకీయాలే పోలీసుశాఖను నడుపుతున్నాయనేది జగమెరిగిన సత్యం. ఈ సూసైడ్ నోట్ సారాంశం : గౌరవ ముఖ్యమంత్రి గారికి నా చివరి కోరిక. నా తమ్ముడు కిరణ్కుమార్ గుడిఅప్నూర్ ఎస్సైని ఏసీబీ ట్రాప్లో ఇరికించారు. దయచేసి అట్టిఫైల్ను చూసి వాన్ని ఏసీబీ నుండి తప్పించమని కోరుతున్నాను. మహేష్ సీఐ, తుల శ్రీనివాస్ సీఐ సారు డీఎస్పీగారు అందరూ మంచివాళ్లు. ప్రశాంత్ సీఐ సార్ నేను మీ గురించి ఎక్కడా చెడుగా చెప్పలేదు. వెంకటేశ్వర్ రెడ్డిసార్, ఉమామేడం తల్లిదండ్రులుగా చూసు కున్నారు. చాలా సంతోషం. సిటికేబుల్ గొడవలో ఎల్ఓ ఎల్సిఓలకు నష్టం జరగకూడదు అని చేశాను తప్ప వేముల రాంమూర్తికిగాని, మహేందర్ సింగ్ను కానీ ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు. ఎమ్మెల్సీ ఎల్ రాజయ్యా మీ ప్లెక్సీలను డిసెంబర్ 31 రోజు ఎవరైనా చింపుతారనే ఉద్దేశంతో తప్ప ఎమ్మెల్యేగారు ఏమీ చెప్పలేదు. రమణారావుగారు నన్ను చాలా అభిమానించారు మరువలేను. రవికిషోర్ బ్రదర్ మిస్యు. పెద్దపెల్లిలో ఉద్యోగరీత్యా ఎవరినైనా ఏమైనా అంటే క్షమించండి' అంటూ ఎస్ఐ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఇంకా బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులను క్షమాపణ కోరారు. అందరూ బాగుండాలని ఆకాంక్షిస్తూ నోట్లో పేర్కొ న్నాడు. 'దయచేసి నా శరీరానికి పోస్టుమార్టం చేయొ ద్దు' అని కూడా ఎస్ఐ తన లేఖలో పేర్కొన్నారు.