Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్
- నల్లగొండ జిల్లా మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ - భువనగిరి రూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా 40వ మహాసభలు శనివారం భువనగిరి మండలం రాయగిరిలో సంగు రవీందర్, భట్టుపల్లి శ్రీనివాస్, ఉదయగిరి శ్రీనివాస్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తోందని, దీంతో విద్య వ్యాపార, కాషాయీకరణగా మారే ప్రమాదముందని చెప్పారు. నరేంద్రమోడీ అంటే అందరూ నమో అంటారుగానీ ఇప్పుడు నమ్మించి మోసం చేసేవాడిగా మారిపోయాడన్నారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నేడు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు. ఫలితంగా విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా విద్యారంగాన్ని అభివృద్ధి పర్చాలని కోరారు. దీనికి ఎలాంటి యాగాలూ అవసరం లేదన్నారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. యుటిఎఫ్ రాష్ట్ర నాయకురాలు సంగు రమాదేవి మాట్లాడుతూ పాఠశాలల్లో బాలబాలికలకు మరుగుదొడ్లు లేవని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా స్పందన లేదన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మల్లం మహేశ్, సిహెచ్.శ్రావణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో సంఘం జిల్లా కార్యదర్శి బత్తుల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.