Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాగ్యనగరంలో స్తబ్ధుగా బీజేపీ
- 'గ్రేటర్'లో పరాభవ నేపథ్యం
- పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి ఎవరికో
- రేసులో హైదరాబాద్ నేతలు!
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజధాని నగరంలో భారతీయ జనతా పార్టీ మిణుకు మిణుకుమంటోంది. దాని ప్రాభవం క్రమంగా పడిపోతున్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో నోరెళ్లబెట్టేలా చేసిన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నది. ఆ కుదుపు నుంచి తేరుకోవడంలేదు. అధికార పార్టీ ఆసాంతం మోసపూరితంగా వ్యవహరించిందనే ఆరోపణలు మాత్రం గుప్పించింది. కానీ..క్షేత్రస్థాయిలో తమ పార్టీ జనానికి ఎందుకు దూరమవుతున్నదో సమీక్షించుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గతంలో వచ్చినప్పుడు బోధించిన పాఠాలను ఏ మేరకు ఒంట బట్టించుకున్నారన్నది సందేహంగానే మిగిలింది. ఆయన కూడా ఇక్కడి నేతలు, నాయకులను గాడిన పెట్టడంలో ఎంతవరకు సఫలమయ్యారన్నదీ ప్రశ్నార్థకమే. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల మంచి చెడుల పాళ్లపై ఒక పట్టాన నిర్దిష్ట అవగాహనకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లలో టీడీపీతో కలిసి పోటీ చేస్తే అనేక చోట్ల అనుకూలించలేదు. కొన్ని డివిజన్లలోనైతే పరస్పరం తలపడి టీఆర్ఎస్కు మేలు చేశారు. 'దేశం'తో జత కట్టడం, మరీ ముఖ్యంగా ఆయా ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు తంతు పార్టీలోని సింహభాగం శ్రేణులకు ఏమాత్రం రుచించలేదు. అందుకే గత నెలలో జరిగిన 'స్థానిక' ఎన్నికల సందర్భంలో ఏకంగా పార్టీ ఆఫీసులోనే గొడవలకు దిగడం రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలను చిన్నబుచ్చాయి. బల్దియాలో రంగంలోకి దిగిన 66 స్థానాల్లో ఎంత లేదన్నా 18 వార్డుల్లో గెలుస్తామనే నమ్మకం పెట్టుకున్నారు. తీరాచూస్తే 4 డివిజన్లలోనే కమలం వికసించింది. వాస్తవానికి 2009 గ్రేటర్ ఎన్నికల్లో ఐదు స్థానాలను నిలబెట్టుకొంది. ఈసారికి ఒకటి తగ్గి కిందకు జారిపడింది. ఇది నగర బీజేపీని తీవ్ర నిరుత్సాహం పాల్జేసింది. ఇక అప్పట్నించి శూన్యం ఆవరించిన పలువురు నేతలు పార్టీ కార్యకలాపాలపట్ల అంతగా ఆసక్తి ప్రదర్శించడం లేదు. తాము తిరిగి బలోపేతమవుతామని ఎన్నికల్లో చేదు అనుభవం తర్వాత పార్టీ శాసనసభా పక్షం నేత డాక్టర్ కోవ లక్ష్మణ్ మీడియాకు చెప్పారు. ఇదిలా ఉండగానే పార్టీ తెలంగాణ శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించే కసరత్తు ఊపందుకొంది. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న కిషన్రెడ్డి హైదరాబాద్వాసి. ఈసారి మరొకరికి అవకాశం ఖాయమంటున్నారు. అది ఎవరిని వరిస్తుందంటే..నాలుగైదు పేర్లు వినబడుతున్నాయి. సీనియర్ నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖరరావు, రామచంద్రారావును పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తోందని వినవస్తోంది. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేరూ ప్రస్తావనకు వచ్చినా ఆయన సుముఖంగా లేరంటున్నారు. మరో మూడేండ్లలో (2019)సాధారణ ఎన్నికలకు సమాయత్తమవడం, ఈలోగా పార్టీలోని యావత్ యంత్రాంగాన్ని చక్కదిద్దడం వంటివి కాచుక్కూర్చున్నాయి. అన్నింటికీ మించి కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వంపట్ల దేశ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ప్రభావాన్ని ఇక్కడ అధిగమిండం అంత తేలిక కాదన్నది రాజకీయ పరిశీలకుల మనోగతం.