Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకాలు పక్కదారి పడితే ఐరన్ హ్యాండ్తో డీల్
- జూన్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభం
- సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, దళితులు, మహిళలకు అమలవుతున్న విధంగానే మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మైనార్టీల సంక్షేమ కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై ఆదివారం క్యాంప్కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఎంపీ వినోద్, ఒవైసీ సొదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు, మైనార్టీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే.ఖాన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, లా సెక్రెటరీ సంతోష్రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలకు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాల అమలు తీరు గురించి సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో పెండింగ్లో ఉన్న జూనియర్, డిగ్రీ తదితర కళాశాలల భవన నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తరువాత కూడా అమలులో ఆలస్యం అయితే సహించేదిలేదన్నారు. మైనార్టీ సంక్షేమాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు, బడ్జెట్ కేటాయింపుల్లో పక్షపాతం చూపించారు, మన ప్రభుత్వం సరిపోను బడ్జెట్ను మైనార్టీ సంక్షేమానికై కేటాయించింది, ఎన్ని నిధులు ఖర్చు అయినా పర్వాలేదు మైనార్టీల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించే బాధ్యత మీదేనని సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎం స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అన్యాక్రాంతం అయిన వక్ఫ్భూములను గుర్తించి వెంటనే వక్ఫ్బోర్డుకు అప్పజెప్పాలన్నారు. దారుల్-ఉల్-ఉలూమ్లో ఆడిటోరియం నిర్మాణానికి పది కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో పలు చోట్ల నిర్మించ తలపెట్టిన జూనియర్, డిగ్రీ కళాశాలల భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిష్టాత్మక జామై నిజామియా యూనివర్శిటీకి చెందిన కోర్సులను గుర్తింపును పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రికి ఫోన్చేసి చెప్పారు. మార్చి 31లోపు మైనార్టీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నయాపైసా ఉంచుకోకుండా చెల్లించాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ సెక్రెటరీని ఆదేశించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం ముస్లింల పక్షమే వహిస్తుందని సీఎం హామి ఇచ్చారు.