Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంప కింద దాచి పారిపోయిన నిందితుడు
నవతెలంగాణ-కాటారం
కరీంనగర్లో మరో దారుణం జరిగింది. ముక్కు పచ్చలారని బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన జిల్లాలోని కాటారం మండలం దామెరకుంటలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామెరకుంటకు చెందిన తొగరి రాజస్వామి, త్రివేణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాజస్వామి కాటారం పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తుండగా త్రివేణి అదే గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నది. వీరి ఇద్దరు కుమార్తెలు సింధూజ, విజయశ్రీలు అదే అంగన్వాడీలో చదువుకుంటున్నారు. త్రివేణికి శనివారం కాటారంలో స్టెప్కార్ మీటింగ్ ఉండడంతో అక్కడికి వెళ్లింది. పాఠశాలకు వెళ్లిన చిన్నారులు మధ్యాహ్నం
3.30 గంటల సమయంలో ఇండ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన జక్కుల వెంకటస్వామి వినయశ్రీకి చాక్లెట్ ఎరచూపాడు. ఆమెతోపాటు వస్తున్న సింధూజ, తోటి చిన్నారులను బెదిరించి ఇంటికి పంపి వినయశ్రీని మాత్రం తనతోపాటు ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన వినయశ్రీపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో గంప కింద ఉంచి ఇంటికి తాళం వేసి పారిపోయాడు.
చిన్నారి తల్లి త్రివేణి ఇంటికొచ్చి చూడగా చిన్న కుమార్తె కనిపించలేదు. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లతోపాటు గ్రామంలో వెతికారు. ఎంతకూ కనిపించకపోవడంతో తోటి వారి నుండి వివరాలు తెలుసుకున్నారు. ఇంటి పక్కనే ఉండే వెంకటస్వామి చాక్లెట్ ఇస్తామని ఇంటికి తీసుకెళ్లాడని తెలుసుకోవడంతో అక్కడికెళ్లి పరిశీలించగా తాళం వేసి ఉంది. ఆదివారం ఉదయం అనుమానం వచ్చి వెంకటస్వామి ఇంటి కిటికిలో నుండి పరిశీలించగా ఇంట్లో గంప పక్కన చిన్నారి గౌను కనిపించింది. వెంటనే ఇంటి తాళం పగులగొట్టి గంప తీసి చూడగా రక్తపు మడుగులో కుమార్తె శవమై కనిపించింది. తల్లిదండ్రులు రోదిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. కాటారం సీఐ సదన్కుమార్, ఎస్ఐ రమేష్ హుటాహుటిన పోలీస్ క్లూస్టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు ఎస్ఐ రమేష్ తెలిపారు.