Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- విద్యార్థులకు పాతబకాయిలు చెల్లించాలని వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీలు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మైనార్టీ సంక్షేమ శాఖకు రెండు వేల కోట్లు అదనంగా కేటాయించాలని సీఎంను కోరారు. విద్యార్థులకు చెల్లించే ఫీజురీయంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, గత మూడేండ్ల నుండి మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజు డబ్బును విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, ఇతర టెక్నికల్ చదువులు చదువుతున్న పేద విద్యార్థులు యాజమాన్యాలు అడుగుతున్న ఫీజు చెల్లించలేక చదువును అర్థంతరంగా ఆపేసే పరిస్థితి నెలకొందని సీఎంతో చెప్పామని అసదుద్దీన్ ఒవైసీ మీడియాకు వివరించారు. అలాగే స్కాలర్షిప్ కూడా మూడేండ్ల నుంచి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వీటిని కూడా వెంటనే విడుదల చేయాలని సీఎంను కోరినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 70 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరామని ఒవైసీ బ్రదర్స్ చెప్పారు. పాతబస్తీ అభివృద్ధికి ఈ బడ్జెట్లోనే ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరినట్టు వివరించారు. పాతబస్తీలో మంచినీరు, విద్యుత్, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరినట్టు ఒవైసీ బ్రదర్స్ చెప్పారు.