Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ చంద్రకుమార్
- తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రూ.10వేల చొప్పున చెక్కుల పంపిణీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడితేనే ఆ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆత్మహత్యకు దారితీసిన స్థితిగతులు, కారణాలు ఏమిటనేవి తెలుస్తాయి. హైదరాబాద్లో ఉండి ఆరా తీస్తే తెలియదు' అని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులకు రూ. 10వేల చొప్పున 43కుటుంబాలకు రూ. 4.30లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సోలిపేట రాంచందారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ ఆత్మ హత్యలకు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించాలని కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతుల ఇంటికెళ్లి పరిస్థితులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కన్న బిడ్డలకు అన్నం పెట్టలేని దుస్థితిలో రైతులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లలకు ఫీజులు చెల్లించలేక చదువు మాన్పించిన సందర్భాలున్నాయన్నారు. అప్పుల్లో కూరుకొని పోయి, తలవంచుకుని బతికే పరిస్థితి రైతులకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు నెలకొన్నదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు పచ్చిమేత కరువైందన్నారు. ఆకలి చావులకు దగ్గరయ్యే రోజులు వచ్చాయని హెచ్చరించారు. రైతు కొడుకు వ్యవసాయం చేసేందుకు ఎందుకు ముందుకొస్తలేడనేది ఆలోచించాలని కోరారు. మానవ ధర్మాన్ని అనుసరిస్తూ రైతు కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు అరికట్టకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలను ప్రధాన సమస్యగా భావించి పరిష్కరించాలని కోరారు. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, రైతుల ఆర్థిక పరిస్థితి మాత్రమే సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు, మార్కెట్లో దళారీ వ్యవస్థ ఏర్పడటం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడిపెంచాలని కోరారు.ప్రొఫెసర్ నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క రైతును కూడా రుణ విముక్తి నుంచి బయటపడేయలేదన్నారు. కొత్త రుణాలకు రుణమాఫీ అడ్డంగా మారిందన్నారు. ఈ కార్యక్రమ ంలో మాజీ ఎంపీ మధుయాష్కీ, ప్రొఫెసర్ బాబూరావు, నయనాల గోవర్ధన్, ఉమామహేశ్వర రావు, శంకర్రెడ్డితోపాటు దాతలు రేణికుంట్ల వాసవి, మురళీధర్గుప్తా అనిత, అనంతచారి, నర్మద, వై. మోహన్రావులు పాల్గొన్నారు.