Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వద్ద నిర్మాణానికి గ్రీన్సిగల్
- కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు పాలనాపరమైన అనుమతులు
- మూడు జీఓలను జారీ చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
గోదావరి నదిపై తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులను జారీ చేసింది. దీనిలో భాగంగా రూ. 5,813 కోట్లతో ప్రతిపాదించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి మంగళవారం 231, 232, 233 జీఓలను జారీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి రీడిజైన్లో భాగంగా కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద ప్రధాన బ్యారేజీ నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉంటుందని హైడ్రాలజీ విభాగంతో పాటు కేంద్ర జలసంఘం సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు ప్రభుత్వం వివరించింది. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం, కమాన్పూర్ మండలంలోని సుందిళ్ళ గ్రామాల వద్ద మూడు బ్యారేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాప్కోస్ ఇచ్చిన సర్వే నివేదికల మేరకు ప్రభుత్వం ఈ మూడు బ్యారేజీల నిర్మాణానికి ఉత్తర్వులను జారీ చేసింది. మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీకి రూ. 2,591 కోట్లు, అన్నారం బ్యారేజీకి రూ. 1,785 కోట్లు, సుందిళ్ళ బ్యారేజీకి రూ. 1,437 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేడియల్ గేట్లతో కూడిన బ్యారేజీలు, వీటికి ఇరువైపుల కట్టల నిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
త్వరలో టెండర్లు..
కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మూడు బ్యారేజీ పనులకు సంబంధించి పాలనాపరమైన అనుమతులను ప్రభుత్వం ఇవ్వడంతో ఇక వీటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించడానికి నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో బ్యారేజీ పనులకు టెండర్లను పిలుస్తారని నీటపారుదల శాఖ అధికారులు తెలిపారు. 16 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 32,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దేశంలోనే మొదటి సారి రివర్స్ పంపింగ్ విధానం ద్వారా నీటిని పైకి పంపే ప్రతిపాదనలను ఈ ప్రాజెక్టులో రూపొందించారు. తెలంగాణలో అతి పెద్దదైన ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. దీనిని ఒక కంపెనీగా నమోదు చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను కేంద్ర జలసంఘానికి పంపుతారని తెలిసింది.