Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19,20 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరువు అధ్యయనానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు సీపీఐ మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించింది. శని, ఆదివారాల్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు టి వెంకట్రాములు అధ్యక్షతన హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై తీర్మానం ఆమోదించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కరువును సకాలంలో అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి తగిన సహాయం కోరుతూ నివేదిక సమర్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సార వైఖరి ప్రదర్శించిందని తెలిపారు. రాష్ట్రంలో 434 మండలాల్లో 309 మండలాల్లో తీవ్ర దుర్బిక్షం నెలకొందని ఆయా జిల్లాల కలెక్టర్లు నివేదికలు సమర్పించినప్పటికీ 231 కరువు మండలాలనే ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి కరువు సహాయం కోసం రూ.791 కోట్లు ప్రకటించి రాష్ట్రానికి రెండు విడతలుగా అందించిన రూ.373 కోట్లు అరకొర సహాయాన్నైనా ఒక్క రూపాయి నేటికీ ఖర్చు చేయలేదని విమర్శించారు. కరువును అధ్యయనం చేయడానికి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు జి మల్లేష్, ఆర్ రవీంద్రకుమార్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు పల్లా వెంకటరెడ్డి, ఈర్ల నర్సింహ, పశ్యపద్మ, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సిద్ధి వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, ఆర్ రవీంద్రకుమార్ బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. ఈనెల 19,20 తేదీల్లో కరువు సమస్యపై మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయాల ముందు ప్రదర్శనలు, ధర్నాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని, ఈనెల 25 కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
కరువు నిధుల వివరాలను తెలపండి : సీఎంకు సీపీఐ ఎమ్మెల్యే లేఖ
రాష్ట్రంలో కరువు సహాక చర్యల్లో భాగంగా కేంద్రం విడుదల చేసిన నిధుల ఖర్చు వివరాలను తెలపాలని సీపీఐ ఎమ్మెల్యే ఆర్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు లేఖ రశారు. కరువు నిధులను ఎంత ఖర్చు చేశారు.. ఇంకా ఖర్చు పెట్టాల్సిన వివరాలను సమగ్రంగా అందజేయాలని పేర్కొన్నారు. ఈ వేసవిలో తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పశుగ్రాసం కొరతతో పశువులు కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కరువు సాయాన్ని మరింత పెంచడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.