Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతలను వ్యక్తిగతంగా చేయాల్సిందే
- హెచ్సీయూ వీసీ అప్పారావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం నుంచి ఈనెల 7న వచ్చిన కొంతమంది ప్రొఫెసర్ల రాజీనామాలను ఆమోదించడం లేదని హెచ్సీయూ వీసీ అప్పారావు స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవులకు వ్యక్తిగతంగా వారు రాజీనామాలు చేస్తే, వాటిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల హెచ్సీయూ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీతోపాటు వీసీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పలువురు ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లు తమ బాధ్యతలకు రాజీనామా చేశారు. దీన్ని లేఖరూపంలో వీసీకి పంపారు. ఈనెల 8న వీసీ కార్యాలయం నుంచి ఆ ఫోరం కన్వీనర్కు మెయిల్ చేశారు. బాధ్యతలు వ్యక్తిగతమైనవని, కాబట్టి వ్యక్తిగతంగా రాజీనామాలు రాలేదని, ఈనేపథ్యంలో వీటిని తిరస్కరిస్తున్నామని వీసీ ప్రకటించారు. ఇదే విషయాన్ని ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం కన్వీనర్కు సమాచారమందించారు. ఉద్యోగులంతా వారి బాధ్యతల్లో కొనసాగేలా చూడాలని కోరారు. ఎవరైనా విధుల నుంచి వైదొలగాలనుకుంటే, దానికి కారణం చెబుతూ రాజీనామా చేయాలని, దానిపై యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికైనా అధ్యాపకులు యూనివర్సిటీలో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి సహకరించాలని వీసీ కోరారు.