Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రథమ వర్థంతి సభలో రాఘవులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మికోద్యమ నేత పర్సా సత్యనారాయణ ప్రజా ఉద్యమాలకే తన యావత్ జీవితాన్ని అంకితం చేశారని సీపీఐ (ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆయన జీవితం నేటి నాయకులు, కార్యకర్తలకు ఆదర్శప్రాయమని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పర్సా ప్రథమ వర్థంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పర్సా చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాఘవులు మాట్లాడుతూ...పర్సా స్ఫూర్తితో భవిష్యత్లో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో...ఐక్యంగా వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పర్సా...ప్రతి అంశాన్ని క్షుణ్నంగా, నిశితంగా పరిశీలించి, అధ్యయనం చేసేవారని గుర్తుచేశారు. అలాంటి దృక్పథంతోనే ప్రజా సమస్యలను భిన్న కోణంలో పరిశీలించి ఆందోళనలకు రూపకల్పన చేయాలని సూచించారు.
వెంకట్ మాట్లాడుతూ...మాజీ ఎమ్మెల్యే అయిన పర్సా...తనకు వచ్చే పెన్షన్ను సైతం పార్టీకే ఇచ్చేవారని తెలిపారు. అందుకు సంబంధించిన సొమ్ము పార్టీకి అందుతున్నదా? లేదా? అనే విషయా న్ని కూడా వాకబు చేసేశారని చెప్పారు. విద్యార్థి ఉద్య మ ప్రస్థానం నుంచి సాయుధ రైతాంగ పోరాటం, అటు తర్వాత కార్మికోద్యమ నేతగా చివరి వరకూ ప్రజల మనిషిగా జీవించారని తెలిపారు. నిరాడంబర జీవితం గడిపిన పర్సా...అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని నివాళులర్పించారు. సభలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జీ రాములు, డీజీ నర్సింగరావు, టీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.