Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు వ్యవసాయం పేరుతో భారీ మోసం
- పాలమూరు రైతులను ముంచిన విత్తన కంపెనీలు
- గద్వాల కేంద్రంగా విస్తరించిన విత్తన సామ్రాజ్యం
- దిగుబడి రాకపోవడంతో రైతుల విలవిల
- 8 నెలలు గడిచినా అందని పరిహారం
- కమిటీ వేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం
- ఆత్మహత్య చేసుకున్న వారికీ అందని పరిహారం
- గద్వాల నుంచి కొండూరి రమేశ్బాబు
నమ్ముకున్న అంకురమే వారిని ఆగం చేసింది. రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించే విత్తనాలతో కోట్లకు పడగలెత్తిన బడా విత్తన కంపెనీలు తమ ఎదుగుదలకు కారణమైన రైతు నడ్డి విరిచాయి. వరుస కరవు కాటకాలతో సతమతమవుతున్న పాలమూరు జిల్లాలో వ్యవసాయ శాఖ సాక్షిగా రూ. 600 కోట్ల మోసానికి ఒడిగట్టాయి.హైబ్రీడ్ పత్తి విత్తనాలను పండిస్తే అధిక ఆదాయం వస్తుందని నమ్మబలికి కాంట్రాక్టు సేద్యానికి రైతులను ప్రోత్సహించిన కొన్ని విత్తన కంపెనీలు దిగుబడి రాక పోయినా నష్ట పరిహారం చెల్లించకుండా ముఖం చాటేశాయి. విత్తన వైఫల్యంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు దిక్కు తోచక విలవిల్లాడుతుంటే కేవలం విచారణ కమిటీని నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఇప్పుడు మౌన ప్రేక్షక పాత్ర నిర్వర్తిస్తోంది. తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్ళినా ఇంతవరకూ రైతులకు పరిహారం మాత్రం అందలేదు. పరిహారం కోసం ఆందోళన బాట పట్టిన రైతులు గత ఎనిమిది నెలలుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు.
దేశవ్యాప్తంగా పేరుగాంచిన కొన్ని విత్తన కంపెనీలు మహబూబ్నగర్ జిల్లా గద్వాలను కేంద్రంగా చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా తమ విత్తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. ఇక్కడ పండించిన పత్తి విత్తనాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకుని కోట్లాది రూపాయలు గడిస్తున్నాయి. రైతులకు మాత్రం నామమాత్రపు చెల్లింపులు చేస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నాయి. కాంట్రాక్టు వ్యవసాయం పేరుతో కంపెనీల చేతిలో చిక్కిన రైతులు గత ఐదారేండ్లుగా నష్టపోతూ వచ్చారు. గత సంవత్సరం జరిగిన పంట నష్టంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. ప్రముఖ కంపెనీలు ఇచ్చిన పత్తి విత్తనాల్లో జన్యుపరమైన లోపాలు ఉండడంతో 60 నుంచి 65 శాతం పంట దిగుబడి తగ్గిపోయింది. జిల్లాలోని గద్వాల, మఖ్తల్, ఆలంపూర్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 250 గ్రామాల్లో పత్తి విత్తనాల కోసం 52 వేల ఎకరాల్లో వ్యవసాయం చేసిన 48 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతుల్లో ఎక్కువమంది గద్వాల నియోజకవర్గం పరిధిలోని గద్వాల, మల్దకల్, ఐజ, మద్దూరు గట్టు మండలాలకు చెందిన వారున్నారు. ప్రముఖ విత్తన కంపెనీలైన కావేరి, అంకుర్, నూజివీడు, జేకే, రాశి, శ్రీరామ్ విత్తన కంపెనీలు కాంట్రాక్టు సేద్యం పేరుతో విత్తన సేద్యాన్ని చేయించాయి. అధికారిక లెక్కల ప్రకారం గత సంవత్సరం చేయించిన విత్తన సేద్యంలో కావేరి కంపెనీకి చెందిన విత్తనాలతో 45 శాతం మంది సేద్యం చేయగా మిగిలిన 55 శాతం సేద్యాన్ని మరో ఆరు ప్రముఖ కంపెనీలు చేయించాయి.
దాదాపు అన్ని కంపెనీలు చేయించిన విత్తన సేద్యం గత సంవత్సరం వికటించడంతో రైతులు పూర్తిగా నష్ట పోయారు. విత్తనాలు వేసిన 45 రోజుల్లోనే ఆకులు ఎర్రబడి రాలిపోవడం, ఎండిపోవడం, క్రాసింగ్ చేయగానే పూత రాలిపోవడం జరిగింది. ఎకరానికి రూ. 1,80,000 వరకూ పెట్టుబడి పెట్టిన రైతులు కనీస దిగుబడి కూడా రాక పోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. విత్తన కంపెనీల వద్ద నుంచీ, వడ్డీ వ్యాపారుల నుంచి తెచ్చిన అప్పులు కట్టలేక కుదేలయిపోయారు. చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిన కంపెనీలు, ఆర్గనైజర్ల పేరుతో పనిచేస్తున్న వారి ఏజంట్లు ముఖం చాటు చేయడంతో దిక్కు తోచని స్థితిలో రైతులు అందోళన బాట పట్టారు. గద్వాల ప్రాంతంలో ధర్నాలు చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్యర్యంలో హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశారు.
కమిటీ వేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం...
విత్తన కంపెనీల మోసంపై రైతులు ఆందోళన బాట పట్టడంతో పంటనష్టం అంచనా వేయడానికి గత సంవత్సరం సెప్టెంబర్ 24న జీఓ ఆర్టీ నంబర్ 458 ద్వారా వ్యవసాయ శాఖ ఒక అధికారిక కమిటీని నియమించింది. శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో కూడిన ఈ కమిటీ గద్వాల నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో 13 గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసింది. 60 నుంచి 65 శాతం పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి అందచేసిన నివేదికలో కమిటీ పేర్కొంది. నివేదిక ప్రకారం పెట్టుబడిలో 60 శాతం నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని రైతు సంఘం కోరింది. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో పలుమార్లు విత్తన కంపెనీలతో సమావేశం జరిగింది. పంట నష్టం జరిగి ఎనిమిది నెలలు గడిచినా ఒక్క కంపెనీ కూడా రైతులకు నష్ట పరిహారం చెల్లించలేదు. వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాన్ని కూడా కంపెనీల వారు ఖాతరు చేయక పోవడంతో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అధిక భాగం నష్టపరిహారం చెల్లించాల్సిన కావేరీ విత్తన కంపెనీ కార్యాలయంలో రైతులు ఇటీవల ధర్నా చేశారు.
పట్టు వదలని మల్లన్న ...
- నష్ట పరిహారం కోసం రెండు సార్లు ఆత్మహత్యాయత్నం
- సచివాలయం ముందు ఒకసారి
- వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మరోసారి
విత్తన కంపెనీల చేతిలో మోస పోయిన గద్వాల ప్రాంత రైతులు ఏదో ఒక రూపంలో రోజూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన విత్తనరైతు రాంపురం మల్లన్న నేతృత్వంలో 12 మంది విత్తనరైతులు అక్టోబర్ రెండవ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి తమకు న్యాయం చేయాలని కోరారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ నెల మార్చి 1 వ తేదీన తన తల్లి బోడెమ్మతో కలిసి సచివాలయానికి వచ్చిన మల్లన్న పురుగుమందు తాగడానికి ప్రయత్నించాడు. పోలీసులు పట్టుకుని నివారించారు. ఇంత జరిగినా విత్తన కంపెనీ నుంచి నష్ట పరిహారం అందక పోవడంతో ఏప్రిల్ 14 న రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన మల్లన్న మళ్ళీ పురుగుమందు తాగడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తనకున్న మూడెకరాల భూమిలో ఐదు బోర్లు వేసినా నీరు పడలేదని మల్లన్న వాపోయాడు. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. గత మూడేండ్లుగా విత్తన సేద్యం చేస్తుండడంతో అప్పులు మరింతగా పెరిగిపోయాయి. అప్పు ఐదు లక్షలకు చేరడంతో అది తీర్చే మార్గం లేక పోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు మల్లయ్య తెలిపాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాయలంలో 2014 జూన్లో ఆయన్ని కలసి తన అప్పుల బాధ గురించి చెప్పానని మల్లయ్య వివరించాడు. కలెక్టర్ ద్వారా నివేదిక తెప్పించుకున్న తర్వాత న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకూ తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని తెలిపాడు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ వచ్చినా జిల్లా అధికారులు పట్టించుకోలేదని మల్లయ్య వాపోయాడు.
ఇల్లు దగ్ధం చేసిన దుండగులు
ఆలూరు గ్రామ విత్తన రైతులకు నేతృత్వం వహిస్తున్న మల్లయ్యకు న్యాయం జరగక పోగా వేధింపులు ఎక్కువయ్యాయని గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తన ఇల్లు తగులబెట్టారని మల్లయ్య తెలిపాడు. ఊరి చివర పొలంలో కట్టుకున్న పూరింట్లో తన బంధువుతో కలసి నిద్రిస్తున్న సమయంలో రాత్రి వేళ తన ఇంటికి ఎవరో నిప్పంటించారని, ప్రమాదం నుంచి తాను బయట పడ్డానని వివరించాడు.