Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి టీస్యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీలను అనుమతించి, నాలుగేళ్లుగా వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న దంపతులను ఒకే దగ్గర పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ బదిలీలను ఈ వేసవిలోగా నిర్వహించాలని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ నర్సిరెడ్డి, చావ రవి సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. దంపతులైన ప్రభుత్వ ఉద్యోగులను ఒకే చోటుకు బదిలీలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన జీవోనెంబర్ 182లోని నిబంధనలను ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని, పరస్పర బదిలీలకు అనుమతించాలని కోరారు. దీంతో పాటు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న దంపతులు, స్థానిక ఉపాధ్యాయుల అంతర్రాష్ట బదిలీలకు అనుమతించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ అంతర్జిల్లా బదిలీలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో...
ఉపాధ్యాయులకు అంతర్జిల్లా బదిలీలకు అవకాశమిస్తూ షెడ్యూల్ విడుదల చేయాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పులి సరోత్తంరెడ్డి, ఎన్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కే జనార్ధన్రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్రెడ్డిలు కలిసారు.