Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరిపై మరొకరు పిడిగుద్దులు..పరిస్థితి ఉద్రిక్తం
- మాట్లాడనివ్వట్లేదని ఎండలో కూర్చొని మహిళా ఎంపీపీ నిరసన
- రైతు సమన్వయ కమిటీ సమావేశంలో ఘటన
- ఆందోళన మధ్యనే సభలో మాట్లాడి వెళ్లిపోయిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-యాచారం
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో మంగళవారం జరిగిన రైతు సమన్వయ కమిటీ అవగాహనా సమావేశం రసాభాసగా మారింది. సభ ప్రారంభంలోనే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గ్రూపు, ఎంపీపీ గ్రూపులు బాహాబాహీకి దిగాయి. ఇరు గ్రూపులవాళ్లు కొట్టుకున్నారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీపీ నిరసన తెలుపుతున్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సభలో మాట్లాడి పోలీసుల బందోబస్తు మధ్య వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ యాచారం ఎంపీపీ జ్యోతిశ్రీనివాస్నాయక్ చాలాసేపు ఎండలో కూర్చొని నిరసన తెలిపింది.
యాచారం మండల కేంద్రంలోని సాయిశరణం గార్డెన్లో నిర్వహించిన రైతు సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్మే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. సభ వద్ద జడ్పీటీసీ రమేశ్గౌడ్, పీఎసీఎస్ చైర్మెన్ సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ యాచారం మండల అధ్యక్ష, కార్యదర్శులు అచ్చన మల్లికార్జున్, తలారి మల్లేశ్, శంకర్నాయక్తో పాటు మరి కొంతమంది ఉన్నారు. సభ వద్దకు టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షులు ముత్యాల మధుసూధన్రెడ్డి, నల్లవెల్లి ఎంపీటీసీ సందాని, వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణయాదవ్, నందివనపర్తి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు యాదయ్యగౌడ్ లేచి సీనియర్ నాయకులమైన తమకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఎలా సమావేశం నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అడ్డుతగులుతూ జడ్పీటీసీ వారిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఎంపీపీ, ఎమ్మెల్యే గ్రూపుల వాళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పోలీసులు కలుగజేసుకుని సందాని, ముత్యాల మధుసూదన్రెడ్డిలను గార్డెన్ బయటికి తీసుకెళ్లారు.
అంతలోనే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అందరూ సభాప్రాంగణంలోకి వచ్చారు. ముందుగా వ్యవసాయ శాఖ ఏడీఏ మాట్లాడి అందరితో ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడాలని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడడానికి మైక్ తీసుకున్నారు. అంతలోనే ఎంపీపీ జ్యోతి శ్రీనివాస్నాయక్ లేచి 'సార్ నేను మాట్లాడుతాను రెండు నిమిషాలు అవకాశం ఇవ్వండి' అని ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే మైకు తీసుకున్నారు. ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకపోవడంతో ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణయాదవ్, ఎంపీటీసీ సందాని వేదికపై నుంచి దిగారు. గిరిజన మహిళ అయినందుకే సభలో మాట్లాడనివ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వారి ఆందోళనను పట్టించుకోకుండా సభలో మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో ఎపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ గార్డెన్ ఎదుట ఎండలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. సభలో మాట్లాడిన అనతరం ఎమ్మెల్యే గార్డెన్ నుంచి పోలీసులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కారులో వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లగానే మళ్లీ ఆందోళన మొదలైంది. నల్లవెల్లి ఎంపీటీసీ సందాని, నందవనపర్తి గ్రామశాఖ అధ్యక్షులు యాదయ్య గౌడ్లను మరో గ్రూపువాళ్లు కొట్టేందుకు వెంబడించారు. యాచారం సీఐ వారిద్దరినీ అక్కడి నుంచి తప్పించారు. పోలీసులు ఇరువురికీ నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించేశారు. మండలంలో అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు రెండుగా చీలిపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.