Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరానికి రియల్ ధర రూ. 50 లక్షలు
- రైతన్నకు రూ. 4లక్షలే పరిహారం
- అవి అప్పులకే సరిపోవు..అందుకే హైకోర్టుకుపోయాం
- న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు
- మంత్రుల భూముల కోసమే రిజర్వాయర్ : ఉదండాపూర్ నిర్వాసితులు
అమాత్యులకు, రియల్ ఎస్టేట్ యజమానులకు బంగారం పండిస్తున్న భూములు అన్నదాతను మాత్రం నిరాశకు గురిచేస్తున్నాయి. జాతీయ రహదారి పక్కనే వందల ఎకరాలు కొన్న మంత్రులు తమ భూములు మునగకుండా చూసుకుని కోట్లాది రూపాయల సంపదను కూడగట్టుకున్నారు. మరోవైపు నామ మాత్రపు పరిహారంతో పేద రైతుల భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నింది. మహబూబ్నగర్ జిల్లా ఉదండాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ వద్ద జరుగుతున్న తతంగమిది. పోలేపల్లి సెజ్ భూముల విషయంలో రైతులకు ఎకరాకు కేవలం లక్షన్నర రూపాయలే పరిహారమిచ్చిన సర్కారు...అదే భూమిని పరిశ్రమలకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున అమ్ముతున్నది. ఉదండాపూర్కు అరకిలోమీటర్ సమీపంలో భూమి ఎకరాకు రూ.50 లక్షల నుంచి కోటి వరకు పలుకుతున్నది. అలాంటి విలువైన రైతుల భూములను సర్కారు రిజర్వాయర్లో ముంచుతూ రూ.నాలుగు లక్షల పరిహారమే చెల్లిస్తామంటున్నది. సర్కారిచ్చే ఆ పరిహారం అప్పులకు కూడా సరిపోదని, మెరుగైన పరిహారం ఇచ్చేవరకూ రిజర్వాయర్ కట్టనివ్వబోమంటూ రైతులు హైకోర్టుకెళ్లారు. అక్కడ తమకు న్యాయం దక్కకపోతే సుప్రీంకోర్టుకూ వెళ్తామని అంటున్నారు.
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో జాతీయ రహదారికి అరకిలోమీటరు దూరంలోనే ఉదండాపూర్ గ్రామముంది. ఉదండాపూర్, వల్లూరు శివార్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 16.9 టీఎంసీల సామర్థ్యంతో ఉదండాపూర్ రిజర్వాయర్ను కట్టేందుకు సర్కారు పూనుకుంది. దీని కింద ఉన్న ఐదు తండాలు, రెండు గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోనున్నాయి. ఉదండాపూర్లోని ఐదువేల మంది, వల్లూరు, ఐదు తండాల్లోని ఆరువేల మంది నిర్వాసితులు కానున్నారు. ఉదండాపూర్లో 3,500 ఎకరాలు, వల్లూరులో వెయ్యిఎకరాలు, నాలుగు తండాల్లో 1500 ఎకరాలను రైతులు కోల్పోనున్నారు. ఆ భూములకు గానూ సర్కారు ఎకరాకు కేవలం నాలుగు లక్షలే చెల్లిస్తామంటున్నది. ఈ భూములకు అర కిలోమీటరు దూరానా జిల్లా మంత్రలవి 500 ఎకరాలు ఉన్నట్టు సమాచారం. బాలానగర్, శంషాబాద్ దగ్గరల్లో ఉండటంతో ఆ భూములు ఎకరాకు రూ.50 లక్షల నుంచి కోటివరకు పలుకుతున్నాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ కింద పెద్దల భూములు మునుగకుండా... పేదల భూములు మునిగేలా కుట్రపన్ని రిజర్వాయర్లు నిర్మించతలపెట్టారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉదండాపూర్కు ఐదు కిలోమీటర్ల దూరాన పోలేపల్లి సెజ్ సమీపంలో ఓ మంత్రి దాదాపు 30 ఎకరాలు కొనుగోలు చేశారు. దీనికి హెచ్ఎండీఏ అనుమతులు కూడా లభించాయి. ప్లాట్లు, విల్లాలుగా మార్చి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ఆ లేఅవుట్లో స్థలానికి సంబంధించిన రేట్లను హోర్డింగుల ద్వారా తెలియజేస్తున్నారు. 200గజాల స్థలంలో ఒక ఇంటిని నిర్మించి కొనుగోలుదారుడికి ఇవ్వడానికి దాదాపు రూ. 27లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదే మంత్రికి బాలానగర్ సమీపంలో ఐదొందల ఎకరాలు ఉన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. తన ల్యాండ్కు నీరువచ్చే విధంగా రిజర్వాయర్ను ఉదండాపూర్కు తెప్పించుకున్నారని విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.
పరిహారం అప్పులకే...అందుకే కోర్టు : నిర్వాసితులు
ఎకరాకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఇదివరకు చేసిన అప్పులకే సరిపోతాయి. గతంలో పంటరుణాలు ఇచ్చిన బ్యాంకులతో పాటు ప్రయివేటు అప్పుదారులు సైతం వచ్చే పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక వైపు భూములు పోయిన దు:ఖంలో నిర్వాసితులు ఉంటే... శవాల మీద చిల్లర ఏరుకుంటున్నట్లుగా పరిహారం కింద వచ్చే డబ్బును అప్పుల కింద జమచేసుకోవడానికి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. డబ్బులు ఇచ్చేది ఆర్డీఓ కావడంతో ఆయనకే నోటీసులు జారీ చేస్తున్నారు. బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇవ్వకుండా సర్వే నెంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టారు. మునిగిపోయే ఊరుకు అప్పులిస్తే ఎగ్గొడతారని మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం మానేశారు. తహసీల్దార్ క్లియరెన్స్ ఇస్తేనే మిగతా రాయితీలు వస్తాయి. కానీ రిజర్వాయర్ కింద మునిగే భూములకు తహసీల్దార్ క్లియరెన్స్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు సమితిలను కూడా ఈ గ్రామాల్లో ఇప్పటిదాకా వేయలేదు.
2013 చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ... ఆ గ్రామ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పొలానికి పొలం, ఇల్లుకు ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పి... అనంతరం ఇచ్చిన హామీ తప్పినందుకే నిర్వాసితులు కోర్టుకు పోవాల్సి వచ్చింది. గ్రామస్తులు జంగయ్య, పెంటయ్య, జి.నారాయణ, జి.సౌజన్య, నారాయణ, భాగ్యమ్మ, శేఖర్, హన్మంతు, బీరయ్య, భీమయ్య, రాములు, రసూల్, హన్మంతు, రాజమల్లయ్య, రాములమ్మ, సత్తమ్మ, శేవ్యా, చెంద్య్రా, నరసింహ, దేవ్యా, లక్కి, బాబు, కిషన్, గోవిందు...ఇలా మొత్తం 50 మంది హైకోర్టుకు వెళ్లి న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరారు.
రైతులకు మెరుగైన పరిహారమివ్వరు...ఏటేటా పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆటుపోట్ల నడుమ ముందుకు కదులుతోంది. రైతులకు మెరుగైన పరిహార ఇవ్వక...సర్కారు అలసత్వం వల్ల పథకం నత్తనడకన సాగుతున్నది. సర్కారు మెరుగైన పరిహారం ఇవ్వకపోవటంతో భూములిచ్చేందుకు రైతులు భూములిచ్చేందుకు ముందుకు రావట్లేదు. నాగర్కర్నూల్ జిల్లాలో 11, 911 ఎకరాలకుగానూ ఇప్పటిదాకా 6,041 ఎకరాలనే సేకరించింది. మిగతా భూములను సేకరించడానికి రైతులు విముఖత వ్యక్తం చేయడంతో భూసేకరణలో వేగం పెరగట్లేదు. వనపర్తిలో 4063 ఎకరాలకు గానూ 3157 ఎకరాలు, మహబూబ్నగర్లో 11358 ఎకరాలకు గాను 5,373 ఎకరాలు మాత్రమే సేకరించారు. 2017-18లో రూ. 4800 కోట్లు కేటాయించి కేవలం రూ. 600కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పనులు అలస్యం కావడం వల్ల రూ. 32500కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు రూ. 55వేల కోట్లకు చేరింది. దీనివల్ల కాంట్రాక్టర్లు లబ్దిపొందుతున్నారు తప్ప అన్నదాతలకు ఒరిగిందేమీ లేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
అప్పులకే సరిపోవు: రామాంజనేయులు, ఉదండాపూర్ మాజీ సర్పంచి
మా ఊరికి అరకిలోమీటరు దూరాన ఉన్న పోలెపల్లి సెజ్లోని ఎకరం భూమి రూ.50 లక్షలకు పైనే పలుకుతోంది. మాకు మాత్రం ఎకరాకు రూ.4 లక్షలకు మించి ఇవ్వబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం బ్యాంకు రుణం, ప్రయివేటు అప్పులకే సరిపోతాయి. మాకు మిగిలేదేమి లేదు.
ఇప్పటికే ఓసారి భూమి కోల్పోయా...మళ్లీనా : గూడుబాయి సాయిరెడ్డి
పదేండ్ల కింద శంషాబాద్ విమానాశ్రయం నిర్మిస్తున్న సమయంలో రెండున్నరెకరాల సాగుభూమిని పోగొట్టుకున్న. ఆ తర్వాత ఉదండాపూర్కు వచ్చి 31 ఎకరాల భూమి కొని మామిడి తోట వేశా. తోట కాపుకు వచ్చి మా కష్టాలు తీరే దశలో నోటికాడి బువ్వను కాలదన్నుతున్నారు. నెత్తినోరు మొత్తుకున్నా వినట్లేదు. అందుకే హైకోర్టుకు పోయాం. గాడ మాకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోతం.