Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుట్టల్లోకి తీసుకెళ్లి ఘాతుకం
- మూడ్రోజుల కింద నగరంలో కిడ్నాప్ కేసు
నవతెలంగాణ-అమీన్పూర్/భూదాన్ పోచంపల్లి
హైదరాబాద్లో మూడ్రోజుల కింద కిడ్నాప్కు గురైన ఇంటర్ విద్యార్థిని సంగారెడ్డి జిల్లాలో హత్యకు గురైంది. అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. కొందరు యువతిని గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చినట్టు తెలుస్తోంది. పోలీ సులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం...హైదరాబాద్ పరిధిలో మియాపూర్లోని సత్యనారాయణ ఎన్క్లేవ్ ప్లాట్ నెంబర్ 408లో కిషోర్జైన్ కుటుంబం ఉంటున్నది. అతను వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. చిన్న కుమార్తె చాందినీ జైన్(17) బాచుపల్లి సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఈ నెల తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల సమయంలో స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని అక్క నివేదితా జైన్కు చెప్పి వెళ్లింది. రాత్రి అయినా చాందినీ ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పలుమార్లు ఫోన్చేసినా కలువలేదు. స్థానికంగా తెలిసిన వారి వద్ద, ఫ్రెండ్స్ వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో శనివారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో మియాపూర్ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని రాళ్లగుట్టలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతురాలి చేతికి బంగారు ఉంగరాలు, టాటూలు గుర్తించారు. మృతదేహం వద్ద మద్యం సీసాలున్నాయి. మృతురాలి ఫొటోలను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపగా, తమ పీఎస్ పరిధిలో కిడ్నాప్ అయిన చాందినీజైన్దిగా మియాపూర్ పోలీసులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం తమ కూతురిదే అని నిర్ధారించారు. చాందినిని ఎవరు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేశారు.
యువకుడితో కలిసివెళ్లిన ఫుటేజీలు లభ్యం
చాందినీ కేసులో కీలక సమాచారం దొరికింది. మదీనాగూడ పీజేఆర్ ఎన్క్లేవ్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను సేకరించిన పోలీసులు.. షార్ట్ వేసుకున్న ఓ యువకుడితో కలిసి చాందినీ వెళ్లినట్టు గుర్తించారు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో లభ్యమయ్యాయి.
ఘటనా స్థలాన్ని సందర్శించిన సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి
విద్యార్థిని చాందినీ జైన్ హత్యకు గురైన స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి సందర్శించారు. యువతిని హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు. ఘటనా స్థలాన్ని మంగళవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా కూడా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.