Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం ఎలా?అన్న దానిపై ఉన్నత విద్యామండలి అధికారులు పలు కోణాల్లో సమాలోచన చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రకటించిన పోస్టులకు దేశవ్యాప్తంగా అర్హులైన వేలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. వారిని ఎలా ఏరివేయాలన్న దానిపై కుస్తీ పడుతున్నారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఏరివేతకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక చేయాలని ఓ అభిప్రాయానికి వచ్చారు. కానీ సాధారణ విశ్వవిద్యాలయాల్లో (ఓయూ, కేయూ వంటివి) మాత్రం ఏరివేతకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడానికి అధికారులు సుముఖంగా లేరు. ఆయా విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకులు, నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు. అందుకే సాధారణ విశ్వవిద్యాలయాల్లో భర్తీచేయబోయే పోస్టులకు దరఖాస్తుల నుంచి వడపోతకు ఎలాంటి మార్గాలను అన్వేషించాలన్న దానిపై సమాలోచన చేస్తున్నారు. వారి విద్యార్హతల్లో ఉండే మెరిట్ ఆధారంగా తక్కువ మార్కులున్న వారిని ఏరివేయాలని ఆలోచిస్తున్నారు. అలా చేస్తే మార్కులున్న వారికే ప్రతిభ ఉన్నట్టు ఎలా అవుతుందన్న అనుమానాలు తలెత్తుతాయని భావిస్తున్నారు. పలు అంశాలను పరిశీలించేందుకే ఉన్నత విద్యామండలి బృందం సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించింది. అక్కడ యూజీసీ మార్గదర్శకాలను, ఐఐటీ ఢిల్లీ, ఎన్యుఈపీఏ, ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం సందర్శించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను పరిశీలించారు. అన్నింటిలోనూ దరఖాస్తుల ప్రక్రియ తర్వాత ఒక్కో పద్ధతిలో వడపోత పద్ధతిని అనుసరించాయి. అందులో తెలంగాణకు ఎలా సమంజసంగా ఉంటుందన్నది అధికారులు సమాలోచన చేస్తున్నారు. పూర్తిస్థాయిలో అవగానహకు వచ్చేందుకు వారం రోజుల్లో ముంబై లేదా పూణేలో విశ్వవిద్యాలయాలను పరిశీలించేందుకు వెళ్లాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం నిర్వహించి నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి వివరించారు. ప్రభుత్వ ఆమోదం వచ్చాక ఆ మార్గదర్శకాలను విశ్వవిద్యాలయాలకు పంపించనున్నట్టు చెప్పారు. ఆ వెంటనే విశ్వవిద్యాలయాలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తాయన్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీయే కీలకం
రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 1,551 పోస్టులు ఖాళీగా ఉంటే, తొలివిడతలో 1,061 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 99 ప్రొఫెసర్, 270 అసోసియేట్ ప్రొఫెసర్, 692 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల ప్రకారం విశ్వవిద్యాలయాలకే ఆ పోస్టులను భర్తీ చేసుకునే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేసే వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కీలకం కానుంది. ఇందుకు యూజీసీ మార్గదర్శకాలే ప్రామాణికం కానున్నాయి. కాగా వర్సిటీల్లో భర్తీ ప్రక్రియకు పలు ఆటంకాలు ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాలి. నెట్, స్లెట్ తప్పనిసరిగా ఉండాలి. 2009, జులై 11లోపు పీహెచ్డీ రిజిస్ట్రేషన్ చేసుకొని థీసిస్ చేస్తూ ఉన్న వారూ అర్హులే. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో అకడమిక్ రిపోర్టుకు 50 శాతం మార్కులు, విజ్ఞానం, పరిశోధన, ఆలోచన, నైపుణ్యం వంటి అంశాలకు 30 శాతం మార్కులు, ఇంటర్వ్యూకు 20 శాతం మార్కుల చొప్పున ఉంటాయి. వీటి ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎక్కువ మంది పదోన్నతుల ద్వారానే పొందే అవకాశముంటుంది.
భర్తీ ప్రక్రియకున్న ఆటంకాలు...
వర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఏండ్లుగా పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఏంటన్నది సమస్యగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చినందున కొత్త నోటిఫికేషన్లు ఇస్తే కొందరి ఉద్యోగాలు పోయే ప్రమాదముంది. ఉద్యోగాలు కోల్పోయే వారు కోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు దరఖాస్తు చేసుకున్న వారిని ఏరివేతకు తీసుకునే పద్ధతిపైనా వ్యతిరేకత వచ్చే అవకాశముంది. సాధారణ వర్సిటీల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే పరిస్థితి లేదు. నిర్వహిస్తే అడ్డుకునే అవకాశముంది. ఇంకోవైపు మెరిట్ ఆధారంగా వడపోత చేసినా శాస్త్రీయత కాదేమోనన్న అనుమానం అధికారులను వెంటాడుతున్నది. ఇలా అనేక ఆటంకాలు భర్తీ ప్రక్రియ ముందుకెళ్లకుండా చేసే అవకాశముంది. దీన్ని ఎలా అధిగమించి వర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తారన్నది కత్తిమీద సాములా మారింది.